హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): దేశ విత్తనరంగంలో తెలంగాణ రాష్ర్టానిదే కీలకపాత్ర అని, రాష్ట్రంలో విత్తనరంగ అభివృద్ధికి మరింత అవకాశం ఉన్నదని హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి ఎంతో బాగున్నదని, పంట ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయని ప్రశంసించారు. ఇటీవల ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కే కేశవులు బుధవారం స్వామినాథన్ ఫౌండేషన్ ఆహ్వానం మేరకు చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామినాథన్ వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ఎంతగానో ప్రశంసించారని, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులతో ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు జీవం పోసిందని కితాబు ఇచ్చారని కేశవులు తెలిపారు.
విత్తనరంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, విత్తన నాణ్యత, ఎగుమతులు ఇతర అంశాలపై స్వామినాథన్ చర్చించారని, దేశంలో విత్తనరంగం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు తమ ఫౌండేషన్ కూడా కృషి చే స్తుందని స్వామినాథన్ చెప్పినట్టు వివరించారు. ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులును అభినందించారు. ఒక అంతర్జాతీయ స్థాయి విత్తన సం స్థకు అధ్యక్షుడిగా భారతదేశం నుంచి ముఖ్యం గా తెలంగాణ నుంచి ఒక అధికారి ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేశారు. విత్తనరంగంలో మరింత కృషి చేయాలని కేశవులకు సూచించారు.