GSLV | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ), శ్రీహరికోట, మే 29: ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహం (ఎన్వీఎస్-01)ను నింగిలోకి పంపారు. సోమవారం ఉదయం 10.42 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో ప్రయోగం విజయవంతమైననట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగంలో భాగస్వాములైన వారికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.
భారత్కు చెందిన రెండోతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-01 మొదటిది. ఈ ఉపగ్రహం జీవితకాలం 12 ఏండ్లు. ఇది భారత్ చుట్టూ సుమారు 1,500 కి.మీ పరిధిలో సేవలను అందిస్తుంది. దీని వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులను తెలుసుకోవచ్చు.
జులైలో చంద్రయాన్-3ప్రయోగం నిర్వహించనున్నట్టు ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు. నావిగేషన్ ప్రయోగం సందర్భంగా శ్రీహరికోటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి చంద్రయాన్-3 కచ్చితంగా విజయవంతం అవుతుంది’ అని అన్నారు. చంద్రుడికి 100కి.మీ ఎత్తులో లూనార్ ఆర్బిట్కు చేరుకున్నాక, అక్కడ్నుంచి చంద్రయాన్3 ల్యాండర్, రోవర్ను సురక్షితంగా ఉపగ్రహంపై దింపటంతో ఈ ప్రయోగం ముగుస్తుంది. దీనికి సంబంధించి నిర్వహించే ప్రొపల్షన్ మోడల్ (షేప్) ప్రక్రియ అత్యంత కీలకమైంది. చంద్రయాన్2ను జులై, 2019లో ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుడి కక్ష్యలోకి వాహకనౌకను ప్రవేశపెట్టడంలో ఇస్రో విజయం సాధించినప్పటికీ, ల్యాండర్ అనుకున్నవిధంగా చంద్రుడిపై కాలుమోపలేదు.