హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించబోతున్నది. దక్షిణ ధృవంలోని అంటార్కిటికా కేంద్రంగా భారత్ చేస్తున్న ఉపగ్రహ పరిశోధనలకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్నగర్లో ఉన్న ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) మారబోతున్నది. అంతరిక్ష, వాతావరణ, ఉపగ్రహ పరిశోధనలపై నిఘా సమాచార క్రోడీకరణ, బదిలీ చేయడానికి అవసరమైన హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా కేఏ-బ్యాండ్ శాటిలైట్ వ్యవస్థ ఏర్పాటు కాబోతున్నది. దాదా పు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో ఈ వ్యవస్థను ఏ ర్పాటుచేసేందుకు ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ కృషి చేస్తున్నది. ఇక్కడి నుంచి 11 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటార్కిటికా ఖండంలోని భారత పరిశోధన కేంద్రాలకు దృఢమైన నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు.
ఉపగ్రహ పరిశోధనలో కీలకపాత్ర
అంటార్కిటికాలో మనదేశానికి మైత్రి, భారతి అనే రెండు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పర్యావరణం, శాటిలైట్, ధృవ ప్రాంతాల్లో మార్పులపై నిత్యం వందమంది భారత శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు . ఈ క్రమంలో అక్కడ సేకరించిన సమాచారాన్ని బదిలీ చేసేందుకు మెరుగైన నెట్వర్కింగ్ వ్యవస్థ లేదు. ఈ కారణంగా రియల్ టైం డాటా విశ్లేషణ, తాజా వాతావరణ పరిస్థితులను అంచనా వేయడంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా అంటార్కిటికాలోని పరిశోధన కేంద్రాలు, ఉపగ్రహాలకు అనుసంధాన కార్యకలాపాలను షాద్నగర్ ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ నుంచి నిర్వహించనున్నారు. భార త రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, భూ పరిశీలన ఉపగ్రహాల కోసం అంటార్కిటికాలోని లార్సెమన్ హిల్స్, భారతి స్టే షన్లలో ఇస్రో గ్రౌండ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఈ గ్రౌండ్ స్టేషన్లకు చేరిన డాటాను షాద్నగర్లోని ఎన్ఆర్ఎస్సీకి బదిలీ చేయడంలో తాజాగా ఏర్పాటు చేయనున్న నెట్వర్క్ కీలకపాత్రను పోషించనున్నది.