వరంగల్ : ఇస్కాన్ శ్రీరామ్ విజయోత్సవ యాత్రతో తొర్రూరు పట్టణం భక్తజన సంద్రమైంది. మంగళహారతులతో, కోలాటాలతో తొర్రూరు పట్టణవాసులు శ్రీరాముడి విజయోత్సవ యాత్రకు ఘన స్వాగతం పలికారు. యాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో యాత్రలో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇస్కాన్ సేవాభావంతో చేపట్టే యాత్రను విజయవంతం చేయాలన్నారు. సన్నూరు దేవాలయ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని కోరానని, దీంతో రూ.10కోట్లు మంజూరు చేశారన్నారు. అక్కడ ఇస్కాన్ను ఉచిత భోజనం కల్పించాలని కోరితే.. ఒప్పుకున్నారన్నారు.
అక్కడ పదెకరాల స్థలాన్ని కేటాయించాలని కోరానని, అక్కడి నుంచి వరంగల్వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతారన్నారు. సన్నూరు అభివృద్ధి చేసి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అక్కడే మెడికల్ కాలేజీ పెట్టాలని ఆలోచన ఉందన్నారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయాన్ని గతంలో ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు రూ.30కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. హరిత హోటల్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. వల్మిడి దేవాలయం వాల్మీకి స్వగ్రామమని, ప్రస్తుతం అక్కడ శ్రీరామ నవమి ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వల్మిడి గుట్టపై కూర్చొని వాల్మీకి రామాయణం రాశారన్నారు. బమ్మెర పోతనది భారీ విగ్రహాన్ని రూ.5కోట్లతో ఏర్పాటు చేయడంతో పాటు స్మృతి వనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. వీటి కాపాడాలని ఇస్కాన్ను కోరామని, ఇస్కాన్ ఒప్పుకుందన్నారు.