TS Minister KTR | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు కాంగ్రెస్ నాయకులపై ఒక్క కేసైనా ఉందా అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తమపై అనేక కేసులు ఉన్నాయని, జైలుకు కూడా పోయామని కేటీఆర్ తెలిపారు. ఒక రోజు వరంగల్ జైలులో రాత్రంతా ఉన్నామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇది తమ చరిత్ర అని, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ ఎంటి..? తమపై రోజూ విరుచక పడే నాయకులది ఉద్యమంలో ఏం కాంట్రిబ్యూషన్. ఎక్కడన్న ఒక్క దెబ్బకానీ, ఒక్క కేసు కానీ అయిందా..? కేసు అంటే ఓట్లకు నోట్ల సంచుల మోసుడు కేసు కాదు అంటూ ఎద్దేవా చేశారు.
శనివారం శాసనమండలిలో స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. పార్లమెంటరీ భాషలో కూడా విమర్శలు చేయవచ్చు కానీ ఇంత అన్ పార్లమెంటరీగా, ఇంత దిగజారి, మాట్లాడటమా అంటూ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. `నిన్న మెన్నటి దాకా కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్నరు. కేసీఆర్ రుణ మాఫీ చేయలేదు, కాబట్టి రైతుల్లో అండర్ కరెంటు ఉంది, దాని మీద ఆశ పెట్టుకున్నరు. మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు అంటూ అని లెక్కలు వేసుకున్నరు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి అని మంత్రి కేటీఆర్ అన్నారు.
`కాంగ్రెస్ వాళ్ల వ్యవహారం గమ్మతుగా ఉంటుందని, గతంలో పాకిస్థాన్ క్రికెట్ టీం ఉండేది. ఆ టీంలో ఒక్కరు కెప్టెన్ ఉంటరు, 11 మంది మాజీ కెప్టెన్లు ఉంటరని, ఒకరికి ఒకరికి పడదని, కాంగ్రెస్కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నరు, ఒకరు ఒక దగ్గర కూర్చోలేరు. కానీ వీళ్లు నాలుగు కోట్ల మందిని పరిపాలిస్తామని స్పీచ్లు ఇస్తరు, కాంగ్రెస్ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీని ఎందుకు నమ్మాలో కూడా ప్రజలు కూడా ఆలోచించాలని ప్రజలకు కేటీఆర్ సూచించారు.
తెలంగాణ వచ్చిననాడు ఇక్కడ ఏముంది..? గాఢ అంధకారం, పొద్దున మూడు గంటల కరెంటు, రాత్రి నాలుగు గంటల కరెంటు తప్ప అని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 2009లో కాంగ్రెస్ రెండు హామీలు ఇచ్చింది, వాటిని కూడా నెరవేర్చలేదన్నారు. పగటి పూట 12 గంటల కరెంటు ఇస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా కరెంటు కోసం ధర్నాలు చేశారని గుర్తు చేశారు. వారానికి రెండు రోజులు పవర్ హాలీ డేలు ఏమిటని ప్రశ్నించారన్నారు. వ్యవసాయ సంక్షోభం ఉండేదని చెప్పారు.
తెలంగాణలో ఐదు ఎకరాలు అమ్మి ఆంధ్రలో 50 ఎకరాలు కొనవచ్చని చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరుచుకున్నందుకు ధన్యవాదాలు, ఇప్పటికైనా వాస్తవాలు అంగీకరించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నారు. మా నిబద్ధతను అభినందిస్తున్నందుకు కృతజ్ఞతలు, ఇక్కడి ప్రతిపక్షాల కళ్లు తెరుచుకోవాలని కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు.
`కరెంటు వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉంది, 2009లో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, నేను అప్పటికే నైరాశ్యంలో ఉన్నాను, 171 ఓట్లతో గెలిచాను, మా పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలే గెలిచారు, ఆగమ్యగోచరమైన పరిస్థితి. ఏప్రిల్, మే నెల. అప్పుడే వరి కోతలు సాగుతున్నాయి.. సిరిసిల్లకు మొదటిసారి పోతున్న. జక్కాపూర్ దగ్గర పంట కొనుగోలు కేంద్రం తెరవాలని రైతులు ధర్నా చేస్తున్నరు. వాళ్ల పక్కన కూర్చున్నాను` అని కేటీఆర్ తెలిపారు.
`ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సెషన్ జరిగితే అధికారంలో టీడీపీ ఉంటే కాంగ్రెస్ నాయకులు మొక్కజొన్న కంకులు, లాంతర్లు వచ్చే వారు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ నాయకులు నిరసనలు, ధర్నాలు ఉండేవి. ఒకసారి రోశయ్య ఉరితాడు పట్టుకొని వచ్చారు. నా చిన్నప్పుడు ఎర్రమంజిల్ కాలనీలో ఉండే వాళ్లం. అక్కడి నుంచి బస్సులో స్కూల్స్కు పోయే వాళ్లం. బస్సు ఖైరతాబాద్ మీది నుంచి పోవాలి. ఖైరతాబాద్కు రాగానే బస్సు ఆగిపోయేది. ఎందుకు ఆగిపోయేది అంటే నీళ్ల కోసం జలమండలి వద్ద పీజేఆర్, లేకపోతే తీగల కృష్ణా రెడ్డి ధర్నాలు చేసే వాళ్లు. హైదరాబాద్లో నీళ్లు లేవు. గ్రామాల్లో కరెంటు లేదు. ఎండ కాలంలో గ్రామాలకు వెళ్లాలంటే భయం వేసేది. ఖాళీ బిందెలతో ఎదురపడే వారు. బోరు, మోటారు కావాలంటే నియోజకవర్గ నిధులు ఇచ్చే వారు కాదు. ఆగమ్యగోచర పరిస్థితి ఉండేది` అని కేటీఆర్ అన్నారు. గతంలో రైతు చనిపోతే సంవత్సరం అయినా కూడా ఆపద్బందు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు చనిపోయిన వారం రోజుల్లో చనిపోయిన రైతు కుటుంబ సభ్యుల అకౌంట్లో రూ.5లక్షలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా కానీ ఉందా అంటూ కేటీఆర్ నిలదీశారు.
`చదువు సంధ్య లేకుండా పెరిగిన ఒక పిల్లవాడు చెడు అలవాట్లకు అలవాటు పడి 17 సంవత్సరాలు వచ్చాక తాగుడు, జర్దా బుక్కుడు దిక్కుమాలిన వ్యసనాలు అన్ని అలవాటు అయినాయి. ఒక రోజు తాగి వచ్చి తండ్రి జేబులో డబ్బులు దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఈ విషయం తల్లి చూసి కొట్టింది, అయితే తల్లిని చంపేసాడు. నాన్న చూసి వచ్చాడు… కొడుకును కొట్టాడు. అయితే తాగిన మత్తులో తండ్రిని కూడా రోకలి బండతో చంపాడు. పిల్లవాడిపై పోలీసులు కేసు పెట్టి జడ్జి ముందు ప్రవేశపెడితే.. జడ్జి ఆశ్చర్యపోయి నీకు ఎలాంటి శిక్ష వేయాలో నీవు చెప్పాలంటూ జడ్జి అడిగాడు.. సార్ నేను తల్లి, తండ్రి లేని అనాథను నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడు’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ నేతల తీరు అంటూ కేటీఆర్ పిట్ట కథ చెప్పారు.
`కాంగ్రెస్ పాపాలన్నీ చేసి, చేసిన తప్పులు అన్ని చేసి సాగునీరు, తాగు నీరు, కరెంటు ఇయ్యక, నిధులు ఇయ్యక సావగొట్టి ఇయ్యాల వచ్చి ఇది ఇట్ల ఎందుకు ఉంది, అది అట్ల ఎందుకు ఉంది అంటే 50యేండ్లు మీరే కదా పాలించింది , ఆ సమయం సరిపోలేదా` అంటూ కాంగ్రెస్ తీరుపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ఇన్ని పనులు చేస్తే 50 సంవత్సరాల్లో మీరు ఎన్ని పనులు చేసి ఉండాలి అంటూ కేటీఆర్ నిలదీశారు. పంటల దిగుబడి అద్భుతంగా పెరిగిందన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వంలోకి తీసుకున్నామన్నారు. కేంద్రం ధాన్యం కొనదు, మీ ప్రజలతో నూకలు తినిపించండి అంటారు కేంద్రంలోని నూకరాజులు అని వివరించి చెప్పారు.
కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు నాలుగైదు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలున్నాయోమో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుండె మీద చేయి వేసుకొని చెప్పాలని, రైతు పండించిన పంటనంత ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. ఛత్తీస్గఢ్లో ఒక రైతు నుంచి 12 క్వింటాలు, కర్ణాటకలో 15క్వింటాలు కొంటారు పూర్తిగా కొనరని వెల్లడించారు. మధ్య ప్రదేశ్లో పీడీఎస్కు ఎంత అవసరమో అంతే కొంటారని, రైతులు పండించిన దాన్యం మొత్తం కొనరని అన్నారు. ఇక్కడ మాత్రమే రైతు పండించే ప్రతి గింజా కొంటున్నామని కేటీఆర్ తెలిపారు.