TS Minister Harish Rao | నారాయణఖేడ్ ప్రాంతం 60 ఏండ్ల పాలనలో వెనుకబడి పోయిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ఇంటింటికి నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలో మాత్రం మూడు, నాలుగు రోజులకోసారి తాగునీరు వస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ఎస్సీ, మైనారిటీ సామాజిక వర్గాల పిల్లలకు గురుకులాలు రావడంతో నారాయణఖేడ్ ప్రాంత పిల్లలు ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకుంటున్నారని హరీశ్ రావు చెప్పారు. నారాయణఖేడ్లో 150 పడకల దవాఖాన నిర్మించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్కు నిధుల వరద పోటెత్తిందన్నారు. బసవేశ్వర ప్రాజెక్టు పూర్తయితే నారాయణఖేడ్ ప్రాంతంలో పంట పొలాలకు సాగునీరందిస్తాం అని చెప్పారు.
గడపగడపకు తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 22 ఏండ్లలో ఎన్నో విజయాలు సాధించామని చెప్పారు. బీ అంటే బీదలు, ఆర్ అంటే రైతులు, ఎస్ అంటే సామాన్య ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లోకి సీఎం కేసీఆర్ వెలుగు తెచ్చారన్నారు.
బీజేపీకి రైతుల ప్రేమ లేదు కానీ, అదానీపైన ప్రేమ ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఎస్బీఐ ద్వారా అదానీకి రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు అడగడం తప్ప బీజేపీకి ఏం రాదని అన్నారు. గత ఎనిమిదేండ్ల పాలనలో చేసిన ఒక్క మంచి పని గురించైనా బీజేపీ చెప్పగలదా? అని నిలదీశారు.
రాష్ట్రానికి నిధులు రాకుండా చేసి, ఆర్ధికంగా ఇబ్బంది పెట్టి ఫెయిల్యూర్ ప్రభుత్వంగా చూపాలని కేంద్రం ప్రయత్నించిందని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని బీజేపీ సూచిందని మండి పడ్డారు. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ పేరుతో ఇబ్బందులు సృష్టించినా తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని చెప్పారు. కేంద్రం ఎత్తులను సీఎం కేసీఆర్ చిత్తు చేశారని అన్నారు. భవిష్యత్లోనూ చాలా కేసులు పెట్టబోతున్నారని అన్నారు. ప్రజల్లో చర్చ పెట్టి బీజేపీ డ్రామాలను బయట పెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తరిమి కొట్టాలన్నారు.
శ్రీరామ నవమి తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 90-100 సీట్లలో విజయం సాధించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.