హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను ఇటీవల రద్దు చేసిన ప్రభుత్వం విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో వారిని నియమించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖలో లష్కర్లు, హెల్పర్లుగా చేరనున్న 5,073 మంది వీఆర్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మాన్యువల్ను సిద్ధం చేయడంతోపాటు 87 మంది ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ (టీవోటీ)కు శిక్షణ కూడా పూర్తిచేశారు. కొత్తగా చేరనున్న వారికి సాగునీటిశాఖ పనితీరుపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. నీటిపారుదలశాఖ పనితీరు, నీటి విడుదల, డ్యాములు, తూములు, పంప్హౌస్లు అంటే ఏమిటి? నీటి విడుదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివాటిపై లష్కర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా వారు 12 రోజులపాటు లష్కర్లు, హెల్పర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీరు ఆయకట్టు వరకు చేరుతుందా? లేదా? అన్న దానిపై దృష్టిపెట్టడంతోపాటు తూములు, గేట్ల నిర్వహణలో లష్కర్లు కీలకపాత్ర పోషించనున్నారు.