అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పోలీసు ( AP Police ) వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan ) ఆరోపించారు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో సీఐ నాగరాజు వేధింపులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి ఓదార్చారు. క్రాంతి కుమార్ కుటుం సభ్యులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ట్యాక్సీ నడుపుకునే సాధారణ వ్యక్తిని సీఐ నాగరాజు వేధింపులకు గురి చేయడంతో వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అతని కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలోనే రెండు దారుణ ఘటనలు సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య చోటు చేసుకున్నాయని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో సీసీ టీవీ ఫుటజీ మాయమైపోతే బ్యాకప్ ఉండదా అంటూ ప్రశ్నించారు.