వనపర్తి : సాగునీటికి సంబంధించి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో పెండింగ్ సాగునీటి పనులపై హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సాగునీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరునెలలలో ఘణపురం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి కావాలన్నారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మామిడిమాడ రిజర్వాయర్ పనులు తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సంవత్సరంలోపు డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ పూర్తి చేసి వనపర్తి నియోజకవర్గంలోని సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలన్నారు. ఆశించిన స్థాయిలో పనిచేయని కాంట్రాక్టర్లను పనుల నుంచి తప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.
బుద్దారం కుడి , ఎడమ కాలువల మీద స్ట్రక్చర్లు పూర్తిచేయాలి. మిగిలిపోయిన కాలువలను వెంటనే తవ్వకాలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని డీ8 కింద ఎంజె 1, 3, 4 , ఎంజె 3A కాలువల మీద పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
వెల్టూరు మహాభూపాల సముద్రం, బుద్దారం పెద్ద చెరువు కెపాసిటీ పెంపు పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో సీఈలు హమీద్ ఖాన్, రఘునాథ్ రావు, ఎస్ఈలు సత్యశీలారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఈఈలు, డీఈలు, తదితరులు ఉన్నారు.