హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(డీఎంహెచ్వో) పోస్టుల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది కాసులకు కక్కుర్తి పడి ఉద్దేశపూర్వకంగా డిమాండ్ ఉన్న స్థానాలను బ్లాక్ చేసి దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. బదిలీల ప్రక్రియ ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా రంగారెడ్డి జిల్లా పోస్టును తాము కోరుకున్న వారికి కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.
ఈ నెల ఒకటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా… గత నెల 29న హుటాహుటిన ఓ జిల్లాకు చెందిన డీఎంహెచ్వోను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడటం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ఖాళీలను వెబ్సైట్లో చూపకుండా, సీనియార్టీ రూల్ను పక్కనపెట్టి కొన్ని స్థానాలను మార్కెట్లో అమ్మకానికి పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకేచోట మూడేండ్లు సర్వీస్ పూర్తిచేసిన వారిని బదిలీకి అర్హులుగా పరిగణిస్తారు. నిరుడు నవంబర్లో ఓ జిల్లాకు డీఎంహెచ్వోగా బదిలీ అయిన అధికారిని కనీసం ఏడాది కూడా కాకముందే కీలక జిల్లాకు బదిలీ చేయడం గమనార్హం. ఈ బదిలీ ప్రక్రియలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్ర రాజధాని, చుట్టు పక్కల జిల్లాలతోపాటు, డిమాండ్ ఉన్న స్థానాలను సైతం ఇలాగే బ్లాక్ చేసి డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్ ఉన్న డీఎంహెచ్వో స్థానాన్ని బట్టి పదుల లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ కీలక విభాగాధిపతి చక్కదిద్దుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్టు సమాచారం. మరో వైపు లాంగ్ స్టాండింగ్ అధికారులను కదల్చకపోవడం సైతం చర్చనీయాంశమైంది. రాజధాని శివారుతోపాటు ఆయా జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్ డీఎంహెచ్వోలు ఆదాయ వనరుల దారులన్నీ తెలుసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నా.. వారిని కదల్చకపోవడం వెనుక మతలబు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.