హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం మూసాపేటలోని ఇనుప యుగ ఆనవాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. వారసత్వ స్థలాలు, కట్టడాల పరిరక్షణకు చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మూసాపేట అడ్డరోడ్డు పక్కన రామస్వామి గుట్ట సమీపంలో ఉన్న క్రీ.పూ 1000 ఏండ్ల క్రితం నాటి ఇనుప యుగ సమాధులను పరిశీలించారు. ఆ కాలంలో మరణించినవారిని పూడ్చిపెట్టి, వారి జ్ఞాపకార్థంగా పది మీటర్ల వ్యాసంతో చుట్టూ 18 నుంచి 20 వరకు పెద్ద గుండురాళ్లను గుండ్రంగా అమర్చి ఈ సమాధులను నిర్మించినట్టు వివరించారు. గతంలో తాను ఇదే ప్రదేశంలో ఇనుప యుగం నాటి 100 సమాధులను గుర్తించానని తెలిపారు. వాటి చుట్టూ ఉన్న గుండు రాళ్లను కంకర, కట్టుబడి రాళ్ల కోసం వాడుకోవడంతోపాటు వ్యవసాయ భూముల విస్తరణ, రోడ్డు నిర్మాణం వల్ల ప్రస్తుతం 6 సమాధులే మిగిలాయన్నారు. తెలంగాణలో ఇనుప యుగ చరిత్రకు, తొలితరం కట్టడ నైపుణ్యానికి, క్రీ.పూ వెయ్యేండ్ల నాటి జీవన విధానానికి ఆనవాైళ్లెన ఈ సమాధులను కాపాడి, భవిష్యత్తు తరాలకు అందించాలని మూసాపేట వాసులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమాధుల పరిశీలనలో వారసత్వ కట్టడాల పరిరక్షణ నిపుణుడు శరశ్చంద్ర కూడా పాల్గొన్నారు.