MLA Raghunandan rao | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్రోడ్డు టీవోటీ లీజుపై గత కొంతకాలంగా తప్పుడు ఆరోపణలు, ప్రకటనలు చేస్తున్న బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుకు లీజు దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా డెవపలర్స్ లీగల్ నోటీసులు జారీ చేసింది. న్యాయవాది అయిన రఘునందన్రావు బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి చేసిన తప్పుడు ఆరోపణలు సంస్థ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని, ఇప్పటికైనా చేసిన ఆరోపణలు, ప్రకటనల్ని ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఏకంగా రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావాకు సిద్ధం కావాలని హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం సంస్థ తరపున టీఆర్డీ అసోసియేట్స్ న్యాయవాదులు లీగల్ నోటీసులు ఇచ్చారు.
ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఔటర్ టీవోటీ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. న్యాయవాది అయి ఉండి… న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాలను విస్మరించారని, సమాచార హక్కు కార్యకర్త హత్య విషయంలోనూ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేయటం ద్వారా సంస్థ ప్రతిష్ఠకు రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. రఘునందన్రావుకు జారీ చేసిన లీగల్ నోటీసులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి…
ఒక రాజకీయ నాయకునిగానే కాకుండా శాసనసభ్యుడిగా, చట్టం తెలిసిన న్యాయవాదిగా ఉండి ఒక సంస్థపై నిరాధారమైన ఆరోపణ చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, స్థాయిని మరిచి బహిరంగంగా చేసిన తప్పుడు ప్రకటనలతో ఐఆర్బీ సంస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించారు. ఉద్దేశపూర్వకంగా సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, వ్యాపార కార్యకలాపాలను ప్రభావితం చేసేలా ఆరోపణలు చేశారు. అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఐఆర్బీ పట్ల ప్రజల్లో దుష్ప్రచారం చేయటంతో పాటు కోలుకోలేని విధంగా హాని కలిగించారు.
ఐఆర్బీ సంస్థ ఘోరమైన నేరం చేసిందనే నింద మోపారు. ఔటర్ టీవోటీ టెండర్ల ప్రక్రియ పూర్తి బహిరంగంగా, పారదర్శకంగా జరిగినప్పటికీ వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేశారు. ఒక సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త హత్య కేసులో సంస్థ ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఆ కేసు విషయంలో సీబీఐ వివరణాత్మక దర్యాప్తు తర్వాత కేసును కొట్టివేసిన విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. దీంతో ఈ ఆరోపణ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా న్యాయవాది అయి ఉండి… ‘నేరం రుజువు కానంత వరకు నిర్దోషి’ అనే న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాన్ని సైతం మరిచారు. ప్రజాక్షేత్రంలో ఉండి ఒక సంస్థపై అసత్య ఆరోపణలు చేయటంతో ప్రజల్లో తప్పుడు సమాచారం పంపినట్టయ్యింది.
సంస్థను నిషేధిత జాబితాలో (బ్లాక్ లిస్ట్) చేర్చారని తప్పుడు ఆరోపణలు చేశారు. దీని వల్ల సంస్థ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగింది. ఈ ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవు. ఐఆర్బీ సంస్థ దేశంలోని అనేక మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో విజయవంతంగా పాల్గొంటున్నది. కానీ సంస్థను ఎవరూ, ఎక్కడా బ్లాక్ చేయలేదు. స్వార్థ రాజకీయాల కోసం ఒక సంస్థపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయటం విచారకరం. దీనివల్ల ఆర్థికంగా ఐఆర్బీ సంస్థ ఎంతో బలంగా ఉనప్పటికీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు, ప్రకటనలతో ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. నిరాధారమైన ఆరోపణలు చేసినందున పరువు నష్టం దావా వేస్తున్నాం.
ఔటర్ టీవోటీ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకతతో చేపట్టిన తర్వాతనే ఐఆర్బీని హెచ్-1గా తేల్చారు. ఈ కాంట్రాక్టులో చాలా నిబంధనలు సడలించినట్టుగా కూడా తప్పుడు ఆరోపణలు చేశారు. ఐఆర్బీ సంస్థ ఎక్కడా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడనప్పటికీ వాస్తవాలు, రికార్డులను పరిశీలించకుండా మాట్లాడారు. తద్వారా ఐఆర్బీ సంస్థ బ్యాంకు నుంచి రుణాలు పొందటంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి సుముఖంగా లేని పరిస్థితి నెలకొన్నది. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగా లేదనే తప్పుడు ప్రకటన చేయటం వల్ల బ్యాంకింగ్ సంస్థలు రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి.
రాజకీయ ప్రయోజనాలను మరింత పెంచుకునే ఉద్దేశంతోనే నోటికి వచ్చినట్టు నిరాధారణమైన ఆరోపణలు చేశారు. మీ రాజకీయ ఎజెండాకు సరిపోయేలా ఇష్టపూర్వకంగా ఒక కథను ఊహించుకోవటం, దాన్ని బహిరంగ ఆరోపణల ద్వారా వ్యక్తం చేయటమనేది బాధ్యతారాహిత్యం. ఒక సంస్థ పరువు, ప్రతిష్ఠను ఘోరంగా దెబ్బతీసే ఆరోపణలు, ప్రకటనలతో ఐఆర్బీకి రూ.వెయ్యి కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా వాటిని ఉపసంహరించుకొని… సంస్థ, అధికారులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో పరువు నష్టం దావా కింద చట్ట, న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.