CMO | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సీఎంవో ట్విట్టర్ (ఎక్స్) ఖాతా అంటే దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతాయి. ఈ హ్యాండిల్ ద్వారానే రాష్ర్టానికి సంబంధించిన సమాచారాన్ని అందరూ తెలుసుకొంటారు. అలాంటి అకౌంట్ చాలా హుందాగా, గౌరవప్రదంగా నిర్వహించాలి. దీని నిర్వహణకు ప్రొఫెషనల్ నైపుణ్యం అవసరం. ముఖ్యమంత్రి ప్రెస్మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడినా వాటిని పరిహరించి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు మాత్రమే ఇందులో పోస్ట్ చేయాలి. ఒకవేళ సీఎం ఆవేశానికి లోనై పొరపాటున తప్పుగా మాట్లాడితే దాన్ని నిర్వహిస్తున్నవారు సరిదిద్ది పెట్టాలి. కానీ తెలంగాణ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే సీఎంవో అధికారిక అకౌంట్లో బూతులు పెట్టేస్థాయికి దిగజారింది. కేటీఆర్ను డ్రామారావు అని సీఎం అంటే అదికూడా ఆ అకౌంట్లో ఉంటుంది. తెలంగాణ ఉద్యమనేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రస్తుత సీఎం కొన్ని బూతులు తిడితే అది కూడా అకౌంట్లోకి వచ్చేస్తుంది.
దీనిపై సోషల్మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇది సీఎం అధికారిక అకౌంటా? లేక వ్యక్తిగత ఖాతానా? దీన్ని నిర్వహిస్తున్నది ఐఏఎస్ అధికారా? లేక ఓ నిరక్షరాస్యుడా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. దేశం మొత్తం ఫాలో అయ్యే సీఎంవో ఖాతా నిర్వహిస్తున్న ఐఅండ్ పీఆర్ కమిషనర్ అశోక్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే పలువురు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. దావోస్ పర్యటన సందర్భంగా సర్కారు అభాసు పాలవడానికి ఈ అధికారే కారణమని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని గమనించిన కాంగ్రెస్ సర్కారు అశోక్రెడ్డికి వెంటనే ఉద్వాసన పలికింది.
అశోక్రెడ్డి ఔట్
రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసమర్థ అధికారిగా విమర్శలు ఎదుర్కొన్న సమాచారశాఖ కమిషనర్ కే అశోక్రెడ్డికి ఉద్వాసన పలికింది. ఆయ న స్థానంలో ఎం హన్మంతరావును నియమించింది. అశోక్రెడ్డికి హార్టికల్చర్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి నవీన్నికోలస్ను టీఎస్పీఎస్సీ సెక్రటరీగా బదిలీ చేసింది. జూపార్క్ డైరెక్టర్ వీఎస్ఎన్వీ ప్రసాద్కు సివిల్ సప్లయ్ డైరెక్టర్గా, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బీ బాలమాయదేవిని బీసీ వెల్ఫేర్ కమిషనర్గా, టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ను పంచాయతీరాజ్ కమిషనర్గా, ఫిషరీస్ కమిషనర్గా బీ గోపీ, స్త్రీ శిశుసంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్గా ఏ నిర్మలకాంతివెస్లీ, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా కే సీతాలక్ష్మిని, వెయింటింగ్లో ఉన్న జీ ఫణీంద్రరెడ్డిని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.