కాళోజి హెల్త్ యూనివర్సిటీ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్- పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా/ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.
నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.