హైదరాబాద్ : కరోనా మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల ఎక్స్గ్రేషియా అందించనున్నది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ మంగళవారం మీ సేవ కేంద్రాల ద్వారా ఎక్స్గ్రేషియా కోసం దరఖాస్తులు అందజేయాలని తెలిపింది.
కరోనాతోనే మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర ధ్రువీకరణపత్రాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవా కేంద్రాల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆయా పత్రాలతో దరఖాస్తులు అందజేయాలని సూచించింది.
జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీ కరోనా మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు 040-48560012 ఫోన్ నంబరులో, meesevasupport@telangana.gov.in మెయిల్లో సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ కోరింది.