మళ్లీ ప్రారంభించిన ఏజెన్సీలు
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 28 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ వద్ద ఇన్వెస్టిగేషన్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవల ఏజెన్సీ సంస్థలు పనుల్లో కొంత విరామం ఇచ్చి మళ్లీ ప్రారంభించాయి. బరాజ్లోని ఏడో బ్లాకులో 20వ పియర్ కుంగిన విషయం తెలిసిందే. 20వ పియర్ పక్కనే ఉన్న 19, 21వ పియర్లు సైతం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ మూడు పియర్ల వద్ద ఇన్వెస్టిగేషన్ పనులను డైనాసార్, హట్సన్ ఏజెన్సీలు ఈఆర్టీ, జియాలాజికల్ సర్వేను మూడు నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. మొక్కుబడిగా ఇన్వెస్టిగేషన్ పనులు చేపడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో బరాజ్ వద్ద ఏజెన్సీ నిపుణులు సైతం కనిపించడం లేదు. కాగా ఆదివారం బరాజ్లోని 6వ బ్లాకులో మళ్లీ ఏజెన్సీ సంస్థలు ఈఆర్టీ, జియాలాజికల్ టెస్టులను ప్రారంభించాయి. ఆరో బ్లాకులో పియర్ల పరిస్థితిని తెలుసుకునేందుకు పనులు ప్రారంభించారు. పియర్ల వద్ద పనులు కొనసాగించేందుకు అధికారులు, ఇసుక, మెటీరియల్ సిద్ధం చేసుకున్నారు.