హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల కోసం నూతన పథకాలను ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి కోరారు. ప్రగతిభవన్లో గురువారం మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. వికలాంగుల శాఖ కార్యాలయంలో టీఎస్పీఎస్సీ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ల నియామకం చేపట్టాలని, ప్రతి జిల్లాలో వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని, టీసీపీసీ సెంటర్లను బలోపేతం చేయాలని, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకాల కోసం టాస్క్ఫోర్స్ను నియమించాలని కోరారు. మూగ, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల, ప్రత్యేక ఆడిటోరియం ఏర్పాటు చేయాలని, పారాఒలింపిక్ క్రీడాకారుల కోసం ప్రత్యేక క్రీడా ప్రాంగణం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తగినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.