గర్మిళ్ళ, అక్టోబర్ 26 : మద్యం మత్తులో బెజ్జంకి ఎస్సై వీరంగం సృష్టించాడు. అడ్డువచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. కరీంనగర్ జిల్లా బెజ్జంకి ఎస్సై ఆవుల తిరుపతి.. దీపావళి పండుగ కోసం సొంతూరైన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లికి వచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి తన ఏడుగురు స్నేహితులతో కలిసి మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మద్యం సేవిస్తున్నాడు.
కేకలు పెడుతూ హల్చల్ చేయడంతో స్థానికులు 100 నంబర్కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో బ్లూకోట్స్ సిబ్బంది ఉస్మాన్, సంపత్ అక్కడికి చేరుకొని, విచారణ చేపడుతుండగా ఎస్సై తిరుపతి తన స్నేహితులతో కలిసి దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో పోలీసుల వద్దనున్న ల్యాప్టాప్ ధ్వంసమైంది. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో తిరుపతితోపాటు అతని స్నేహితులు కారు వదిలి పారిపోయారు. ఈ ఘటనలో బెజ్జంకి ఎస్సై తిరుపతితోపాటు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు.