హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ) : భారతీయ సంప్రదాయ వివాహ సంసృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్నది. విజయదశమి పర్వదినాన విదేశీ జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. జపాన్, మంగోలియా, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన పలు జంటలకు భారతీయ వైదిక సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇందుకు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లోని వైదిక వివాహ మంటపం వేదికైంది. ఈ వివాహ వేడుకకు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ స్వయంగా హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. భారతీయ వివాహాలలో ఆడంబరాలు పెచ్చుమీరుతున్న ఈ కాలంలో వేదమంత్రాల సాక్షిగా ప్రమాణాలు, ఒకరిపట్ల ఒకరు నిబద్ధత కలిగి ఉండటం వంటి మౌలిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే వైదిక వివాహాలకు తిరిగి ప్రాచుర్యం కల్పించేందుకు రవిశంకర్ కృషి చేస్తున్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ప్రాచీనవేద మంత్రోచ్ఛారణలు, హోమాలు, భక్తి సంగీత-నృత్యోత్సవాల శోభతో కూడిన వాతావరణం వెల్లివెరిసింది. దేశం, విదేశాల నుంచి లక్షలాది భక్తులు ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలలో పాలుపంచుకొన్నారు. దుర్గాష్టమిరోజున 17 రకాల శాకాహార వంటకాలతో కూడిన భోజనాలను 1,20,000 మంది భక్తులకు వడ్డించారు.