హైదరాబాద్, జనవరి 16(నమస్తే తెలంగాణ): వంట నూనెల ఉత్పత్తి, దిగుమతి, వినియోగంపై చర్చించేందుకు మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐవోఆర్) డైరెక్టర్ రవికుమార్ మాథుర్ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీలో నిర్వహించే ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన 300 మందికిపైగా శాస్త్రవేత్తలు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్, సోయా, ఆవాల, సన్ఫ్లవర్ నూనె వాడకం పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశంలో నూనెల గింజల ఉత్పత్తి, వినియోగం మధ్య భారీ వ్యత్యాసం నెలకొన్నదని తెలిపారు.