హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 20న ముగియనున్నది. ఇప్పటికే పలు సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది. ఇంకా సంస్కృతం, ఇంగ్లిష్ సహా మరికొన్ని సబ్జెక్టుల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉన్నది. ఈ ప్రక్రియనంతా 20 లోపు పూర్తిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలను 4,82,677 (ఫస్టియర్), 4,65,022 (సెకండియర్) మంది విద్యార్థులు రాశారు. ఈ ఏడాది నుంచి ఆన్స్క్రీన్ మూల్యాంకనం నిర్వహించాలని అధికారులు భావించినా పలు కారణాలతో ఆఫ్లైన్ పద్ధతిలోనే కొనసాగుతున్నది. మే చివరి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుండగా, వీటి జవాబుపత్రాలను పాక్షికంగా డిజిటల్ ఆన్స్క్రీన్లో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.