హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 6న విడుదలకానున్నాయి. విద్యాశాఖలో 99 రోజుల ప్రణాళిక నేపథ్యంలో అదే రోజున ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. ఏటా ఆలస్యంగా ఫలితాలు విడుదల చేస్తుండటంతో విద్యాబోధనపై తీవ్ర ప్రభావం పడుతున్నది. జూన్లో కాలేజీలు ప్రారంభమైనా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మూల్యాంకనం వంటి వాటితో సమయం వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేసి, జూన్లోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం సెకండియర్ విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రధాన పరీక్షలు ముగిశాయి. చివరి రోజు 6 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మరో నాలుగు మైనర్ పేపర్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. ఈ నెల 14, 16, 17, 18 తేదీల్లో మైనర్ పేపర్లకు పరీక్షలుండగా ఇవి రెండు, మూడు సెంటర్లలోనే జరుగుతాయి.
కమాండ్ కంట్రోల్ సెంటర్పై అధ్యయనం
ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను పలు రాష్ర్టాల ప్రతినిధులు సందర్శించారు. సీబీఎస్ఈ, నాగాలాండ్, మణిపూర్, పంజాజ్, కర్ణాటక రాష్ర్టాల బోర్డులు, జేఎన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రతినిధులు సందర్శించారు. ఈ సెంటర్ పనితీరుపై అధ్యయనం చేశారు. పరీక్షలు, తరగతుల నిర్వహణ పర్యవేక్షణపై అధికారులను ఆరా తీశారు.
పకడ్బందీగా నిర్వహించాం: కృష్ణ ఆదిత్య
ఇంటర్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య విజయవంతంగా నిర్వహించినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. గతంతో పోల్చితే తనిఖీలు సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. నిరుడు 8,550 సెంటర్లను సందర్శిస్తే.. ఈ ఏడాది 10,426 సెంటర్లలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నిరుడు 115 నమోదైతే ఈ సారి 54 మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు.