హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పల్లె ల వైపు చూసేందుకు వైద్యులు ఇష్టపడకపోవడ మే అందుకు కారణం. అయితే, ఇప్పుడు ట్రెం డు మారింది. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు అందించేందుకు వైద్యులు సై అంటున్నారు. వైద్యారోగ్యశాఖలోని డీఎంఈ పరిధిలో సోమవారం నియామక పత్రాలు అందుకున్న 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎక్కువమంది గ్రామీణ జిల్లాలకు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండటం మారుతున్న వైద్యుల అభిరుచికి అద్దం పడుతున్నది. భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్ ప్రాంతాలు జిల్లా కేంద్రాలుగా మారడంతో వసతులు పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.
మారుమూల ప్రాంతాల్లోని దవాఖానల్లోనూ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పల్లెలపై మమకారం పెంచుకొంటున్న వైద్యులు అక్కడికి వెళ్లి సేవలు అందించేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా నియామకాలు అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లలో 22 మంది చొప్పు న ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎంచుకోగా, 40 మంది ఆదిలాబాద్ రిమ్స్ను ఎంచుకున్నారు. మారుమూల జిల్లాగా చెప్పే ఉమ్మడి ఆదిలాబాద్నే 106 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎంచుకోవడం గమనార్హం. అత్యధికంగా 59 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీలో నియమితులయ్యారు. వనపర్తి జిల్లాను 56 మంది, మహబూబ్నగర్ను 32 మంది ఎంచుకోగా, పెద్దపల్లి జిల్లాకు 48 మంది, మహబూబాబాద్కు 43 మంది, కొత్తగూడెంకు 45 మంది, జయశంకర్ భూపాలపల్లికి 23 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులయ్యారు.