Students Suicides | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని, వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విద్యార్థిని అశ్వితగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) ప్రథమ సంవత్సరం చదివాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్కు చెందిన విద్యార్థి బల్కంపేటలోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురై.. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగోలు తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న సుమతి, రామకృష్ణల కూతురు నిష్ఠ స్థానిక అభ్యాస జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. నిష్ఠ కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తాను అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని ఆత్మహత్యకు పాల్పడింది.