Hyderabad | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): పేదరికం, ఆర్థిక పరిస్థితి అతడి ఆశలకు అడ్డుగోడ కట్టింది. వయసు మించిపోయింది, దారిమూసుకుపోయింది. అయినా నిరాశచెందలేదు. పట్టుదల అతని ఆశలకు వారధి కటిటంది. ప్రయత్నంతో ఇంటర్ పూర్తిచేశాడు. దోస్త్ మెట్లెక్కాడు. ఆయన ఆశయం, లక్ష్యం చూసి ఆశ్యర్యపోయిన అధికారులు రెడ్కార్పెట్ వేశారు. డిగ్రీ చదవటానికి పచ్చజెండా ఊపారు. ఆయనే కల్లా నాగ్శెట్టి. వయస్సు 74 ఏండ్లు. నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎవరీ నాగ్శెట్టి..
కల్లా నాగ్శెట్టి హైదరాబాద్లో ఉప్పుగూడ శివాజీనగర్ నివాసి. బీదర్ జిల్లాలో 1949లో జన్మించిన ఆయన ఎస్ఎస్ఎల్సీ(మెట్రిక్యులేషన్) వరకు అక్కడే చదివారు. ఉన్నత చదువులు చదవాలనుకున్నా కుటుం బ ఆర్థిక పరిస్థితులతో సాధ్యంకాలేదు. ఆ క్రమంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరై సిపాయిగా ఉద్యోగంలో చేరాడు. 21 ఏండ్లు పనిచేసి జూ నియర్ కమిషన్డ్ ఆఫీసర్గా (జేసీవో) పదవీ విరమణ పొందాడు. 1971 ఇండో పాక్ యుద్ధం, 1984 ఆపరేషన్ బ్లూస్టార్లలో పాల్గొన్నాడు. శ్రీలంకకు పంపించిన శాంతిసేన సభ్యుడిగాను సేవలందించి పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత మరో 21 ఏండ్లు ప్రైవేట్ కంపెనీల్లో పలు ఉద్యోగాలు చేశాడు.
చిరుప్రయత్నమే చిగురించి
చిన్నప్పుడు ఆపేసిన చదువును మళ్లీ కొనసాగించేందుకు ఇంటర్బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొన్నారు. చివరకు సైదాబాద్లోని గోకుల్ జూనియర్ కాలేజీలో సీఈసీలో అడ్మిషన్ పొందాడు. ఈ ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు రాసి ఏకంగా 77.04 పర్సంటేజీతో ఇంటర్ పూర్తిచేశాడు.తాను చదువుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు, విద్యాశాఖ మంత్రి పీ సబితాంద్రారెడ్డికి నాగ్శెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.