హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల తొలిరోజే విద్యార్థులు భారీగా డుమ్మాకొట్టారు. ఏకంగా 19 వేల మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు రెండోభాష పేపర్ -1 పరీక్ష నిర్వహించారు. మొత్తం 5,07,754 మంది విద్యార్థులకు 4,88,113 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దీని లెక్కన 19, 641 (3.86శాతం) మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్షాకేంద్రాలకు పంపించగా, తొలిరోజు ‘ఏ’ సెట్ పేపర్ను ఎంపికచేశారు. ఇక గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు
పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే మూడు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మాల్ ప్రాక్టీస్ కేసులను అధికారులు నమోదుచేశారు. విద్యార్థులు చిట్టీలు తీసుకొచ్చి పరీక్షరాస్తుండగా, గుర్తించిన అధికారులు వారిని పరీక్షరాయనీయకుండా పంపించివేశారు.
నిమిషం నిబంధనతో..
పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ముందే హెచ్చరించారు. అయినా తొలిరోజు పలువురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్షరాసే అవకాశం కోల్పోయారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల సెంటర్లో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రాగా, అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది. హైదరాబాద్ మహబూబియా కళాశాల పరీక్షకేంద్రంలో ఒక విద్యార్థి ట్రాఫిక్ కారణంగా ఆలస్యం కావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ధర్మపురి మండల కేంద్రంలో ఓ బాలిక 9.09 నిమిషాలకు పరీక్షకేంద్రానికి రాగా, అధికారులు వెనక్కి పంపించారు. దీంతో సదరు విద్యార్థి కన్నీటిపర్యంతమైంది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల రోదనలు, బ్రతిమాలడాలు పలువురిని కదిలించాయి.
సెల్ఫోన్లను అనుమతించొద్దు : బుర్రా వెంకటేశం
ఇంటర్ పరీక్షల సందర్భంగా సెల్ఫోన్లను అనుమతించొద్దని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీచైతన్య కళాశాల పరీక్షాకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.