హైదరాబాద్: ఇటీవల ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు నిర్వహించిన ఫస్టియర్ పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులో వెల్లడయ్యే అవకాశం ఉన్నది. ఈ నెల చివరి వారంలో ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనంను ఈ నెల 6 నుంచి ప్రారంభించారు.
ఇప్పటివరకు సంస్కృతం, ఇంగ్లిష్ పేపర్లు మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం పూర్తయ్యింది. కేవలం సంస్కృతం, ఇంగ్లిష్ పేపర్ల ముల్యాంకనం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 19 నాటికి ఆ రెండు పేపర్ల జవాబు పత్రాల మూల్యాకనం కూడా పూర్తిచేయాలని అధికారులు డెడ్లైన్ పెట్టుకున్నారు. 19 అనంతరం వారంపాటు ఫలితాలను సమీకరించి ఈ నెలాఖరులో విడుదల చేయాలని భావిస్తున్నారు.