హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా అఫిలియేషన్లు పెండింగ్లో ఉండి ఇంటర్ పరీక్ష ఫీజును చెల్లించలేకపోయిన విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రస్తుతం ఉన్న ఆలస్య రుసుము రూ.1,000ని రూ.100కు తగ్గించింది. బుధవారం బషీర్బాగ్లోని తన కార్యాలయంలో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి.. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్తో ఫీజులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలస్య రుసుమును తగ్గించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా 446 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్బోర్డు నుంచి అనుబంధ గుర్తింపును పొందలేకపోయాయి.
దీంతో వీటిల్లోని 90 వేలకు పైగా విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించలేకపోయారు. ఇటీవలే మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపునివ్వటంతో ఆయా కాలేజీలు అనుబంధ గుర్తింపును దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో వారి ఫీజు చెల్లింపు ఆలస్యమైంది. దీంతో ఒక్కో విద్యార్థి రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. కాలేజీల యాజమాన్యాలు ఫైన్ తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరగా.. తాజాగా విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది. అటు.. మార్చి 15 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు 8 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు. ఈ సంఖ్య 9 లక్షలకు చేరనున్నదని అధికారులు పేర్కొన్నారు.