హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడం, పరీక్షలకు సహకరిస్తామని ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ప్రకటించడంతో వాటి నిర్వహణకు మార్గం సుగమమైంది. యథావిధిగా ఈ నెల 25 నుంచి పరీక్షలు సజావుగా సాగనున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పా ట్లు జరిగాయని, చివరి క్షణంలో వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే తాము స్వీకరించబోమని స్పష్టంచేసింది. పిటిషనర్ అభ్యర్థనతో పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి అనుమతించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి వెళ్లిన విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం చెల్లదంటూ దాఖలైన రిట్ పిటిషన్ను భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. కరోనా కారణంగా టెన్త్ పరీక్షలను కూడా ఈ విద్యార్థులు రాయలేదని, వచ్చే మార్చిలో మూడో దశ కరోనా వ్యాప్తి ఉంటుందన్న హెచ్చరికలు నిజమైతే ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలను కూడా నిర్వహించడానికి వీలుండదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వారందరికీ ఇంటర్మీడియట్ తొలి ఏడాది పరీక్షల నిర్వహణ చాలా అవసరమని చెప్పారు. వాదనల అనంతరం హైకోర్టు.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత చివరి క్షణంలో కోర్టుకు వస్తే తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఫోన్చేయండి.. టెన్షన్ దూరం చేసుకోండి..
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లోని ఆందోళన, భయాలు, ఒత్తిడిని దూరంచేసేందుకు ఇంటర్బోర్డు ఏడుగురు క్లినికల్ సైకాలజిస్ట్లతో కూడిన ఈ హెల్ప్లైన్లను ఏర్పాటుచేసింది. (డాక్టర్ అనిత ఆరే-91549 51704, డాక్టర్ మజహర్ అలీ- 91549 51977, రజిని తెనాలి-91549 51695, పీ జవహర్లాల్ నెహ్రూ-91549 51699, ఎస్ శ్రీలత-91549 51703, శైలజ పీసపాటి-91549 51706, అనుపమ గుత్తిమీది-91549 51687) కాగా, ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సహకరిస్తామని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) ప్రకటించింది.