హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాయిస్ను మరింత పెంచాలని ఇంటర్బోర్డు భావిస్తున్నది. గతేడాదికన్నా ఎక్కువ పశ్నలు ఇవ్వాలని యోచిస్తున్నది. గతేడాది మూడు సెక్షన్లకుగాను రెండు సెక్షన్లల్లో 50 శాతం చాయిస్ ప్రశ్నలను పెంచారు. తాజాగా మూడు సెక్షన్లల్లో ప్రశ్నలను 50 శాతం కన్నా అధికంగా పెంచాలని భావిస్తున్నారు. పూర్తి ప్రతిపాదనలను మంత్రి సబితాఇంద్రారెడ్డికి పంపించి అనుమతి తీసుకొని ప్రశ్నల సంఖ్యను అధికారికంగా ప్రకటించనున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది సైతం 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలను అడగనున్నారు.
ప్రశ్నలు ఇవ్వనున్నారు ఇలా..
2 మార్కుల ప్రశ్నలు గతంలో 10 ఇచ్చి 10 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాల్సి ఉండగా, తాజాగా వాటిని 15కు పెంచాలనుకుంటున్నారు. 4 మార్కుల ప్రశ్నలు గతంలో 8 ఇచ్చి 6 రాయమనగా, వీటి సంఖ్యను గతేడాది 12కు పెంచారు. కానిప్పుడు వీటిని 14కు పెంచనున్నారు. 8 మార్కుల ప్రశ్నలు గతంలో నాలుగు ఇచ్చి 2 రాయమనగా, గతేడాది వీటిని 4కు పెంచారు. ప్రస్తుతం అదే ప్రశ్నలివ్వనున్నారు.