హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేకుండానే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు జారీచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా జీవో జారీచేశారు. దీంతో 446 ప్రైవేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు దక్కనున్నది. ఎన్వోసీ నిబంధనతో రాష్ట్రంలోని 446 కాలేజీలు అనుబంధ గుర్తింపును పొందలేకపోయాయి.
దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరు తూ కాలేజీల యాజమాన్య సంఘాలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. గతేడాది ఇదే నిబంధన నుంచి మినహాయింపునివ్వగా, ఈసారి కూడా ఇవ్వాలని విజ్ఞప్తిచేశాయి. ఈ నేపథ్యంలో రెండేండ్ల పాటు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే 2023-24 తర్వాత మినహాయింపు కుదరదని స్పష్టంచేసింది. సర్కారు నిర్ణయంపై తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) హర్షం వ్యక్తంచేసింది. సీఎం కేసీఆర్, మంత్రి సబితకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్ ఇతర నేతలు ధన్యవాదాలు తెలిపారు.