విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం.. ఏ కాలేజీలో చేరితే బెటర్, ఏ కోర్సు తీసుకుంటే మంచిదని 8,9 తరగతుల నుంచే తల్లిదండ్రులు, విద్యార్థులు మథనపడుతుంటారు. ఇప్పుడీ బలహీనతే కార్పొరేట్ కాలేజీలకు దందాగా మారింది. పదోతరగతి పరీక్షల షెడ్యూల్ రాకముందే, పరీక్షలు కాకముందే, ఫలితాలు వెలువడకముందే.. పలు కాలేజీల్లో 202425 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయ్యాయంటూ కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి.
Corporate Colleges | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి పరీక్షల షెడ్యూలే రాలేదు.. పరీక్షలు నిర్వహించనేలేదు.. ఫలితాలే వెలువడలేదు. కానీ పలు కాలేజీల్లో ఇప్పటికే 202425 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరేట్ కాలేజీల్లోనే ఈ పరిస్థితి నెలకొన్నది. కాలేజీలు సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్ను సృష్టించి సొమ్ము చేసుకొంటున్నాయి. అడ్వాన్స్డ్ బుకింగ్ పేరుతో సీట్లను బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడయితే రాయితీలిస్తాం.. ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయంటూ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన వారి నుంచి భారీగా ఫీజులు గుంజుతున్నాయి. ఈ కృత్రిమ పోటీతో తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. మంచి కాలేజీల్లో సీట్లు దొరకవేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు కాలేజీల వెంట పరుగులు పెడుతున్నారు. ఇంటర్బోర్డు అధికారులు ఈ దందాను అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవానికి పదోతరగతి పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడించిన తర్వాత ఇంటర్బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్ను జారీచేస్తుంది. అప్పుడు ఫస్టియర్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలకు కల్పిస్తారు. కానీ ఇది పేరుకు మాత్రమే జరిగే తంతు. కానీ కార్పొరేట్ కాలేజీలు ముందుగానే అడ్మిషన్లు పూర్తిచేసుకొంటున్నాయి. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఇంటర్విద్య అధికారుల పర్యవేక్షణలోపం.. కాలేజీలను అదుపుచేసే పరిస్థితి లేకపోవడంతో ఇలా జరుగుతున్నదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ఈ అక్రమ దందాకు ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్లే పరిష్కారమన్న వాదనలున్నాయి. ఇప్పటికే ‘దోస్త్’ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ అడ్మిషన్లను విజయవంతంగా చేపడుతున్నారు. ఎంసెట్ సహా అనేక వృత్తివిద్యాకోర్సుల్లో సీట్ల భర్తీని ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఏపీలో ఆన్లైన్ అడ్మిషన్ల చేపట్టేందుకు ఇంటర్బోర్డు ప్రయత్నాలు సాగించారు. మన దగ్గర కూడా ఇదే తరహాలో ఇంటర్లోనూ ఆన్లైన్లో అడ్మిషన్లు చేపట్టడం ద్వారా దందాను అరికట్టగలమని నిపుణులు సూచిస్తున్నారు. ఫీజుల దందాను అదుపుచేయవచ్చంటున్నారు.