హైదరాబాద్ : సమీకృత వ్యవసాయమే రైతులకు లాభసాటిగా ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆదివారం రైతు అవగాహన సదస్సు జరిగింది. ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతులు వరి కాకుండా ఇతర సమీకృత లాభదాయక పంటలు పండించాలని సూచించారు.
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డ వారు సైతం వ్యవసాయంపై మక్కువతో శాస్త్రవేత్తల అనుభవాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని లాభదాయకమైన పంటలు సాగు చేసి ఆదర్శ రైతులుగా స్ఫూర్తినిస్తున్నారన్నారు. రాష్ట్ర సాధన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని, ఆ దిశగా రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటూ రైతులకు నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతులకు రెండు పంటలకు పెట్టుబడి సహాయం, రుణమాఫీ, చనిపోయిన రైతులకు రైతుబీమా వంటి అనేక పథకాలు అందిస్తున్నారన్నారు.
రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోతుందని, రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, అభ్యుదయ రైతులు పలు లాభదాయక పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతుమిత్ర ఫౌండేషన్ ద్వారా అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను శాలువలతో సన్మానించి అవార్డులు అందించారు. కార్యక్రమంలో డీఏఓ రామారావు నాయక్, డీహెచ్వో శ్రీధర్ గౌడ్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస రావు, ఎఫ్డీవో సౌజన్య, రైతులు, ఉద్యాన, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.