సూర్యాపేట, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదన్ను విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. అర్చక ఉద్యోగులకు అత్యుత్తమమైన వేతన వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణుల పిల్లలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం, అర్చకులకు గౌరవ వేతనాలు పెంచడం.. బ్రాహ్మణుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమని స్పష్టం చేశారు. దేశంలోనే తొలి బ్రాహ్మణ సదన్ హైదరాబాద్ గోపన్పల్లిలో నిర్మించగా.. ఆ తరువాతి స్థానం సూ ర్యాపేటకే దక్కిందని తెలిపారు.
అనంతరం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఆధ్యాత్మికతకు పుట్టిని ల్లు భారతదేశమని, అలాంటి ఆధ్యాత్మికతను నిలబెట్టడంలో బ్రాహ్మణుల పాత్ర ఎంతో గొప్పదని చెప్పారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన బ్రాహ్మణులు, రైతులను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. దేశం లో ఆధ్యాత్మికతను బ్రాహ్మణులు కాపాడుతుంటే.. వారికి సీఎం కేసీఆర్ చేయూత ఇస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సదన్ భవనానికి ఖరీదైన ఎకరం స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన డాక్టర్ ఏ రామయ్య, ఆయన కు టుంబ సభ్యులను మంత్రులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలాచార్యులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు సముద్రాల వేణుగోపాలాచారి, యా దగిరిగుట్ట ప్రధానార్చకుడు లక్ష్మీనర్సింహాచార్యులు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, దేవాదాయ శాఖ కమిషనర్ వీ అనిల్కుమార్, తెలంగాణ బ్రాహ్మణ సమాజం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చకిలం రాజేశ్వర్రావు, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.