హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా ( Insurance ) పరిహారాన్ని అందజేశాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహించిన ఎం. వెంకటేశ్ ( Home Guard venkatesh ) గతేడాది ఏప్రిల్ 27న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
హోంగార్డు విభాగంతో యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank ) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, వేతనం అకౌంట్ కలిగిన సిబ్బందికి వర్తించే ప్రమాద బీమా సౌకర్యం కింద రూ. 34 లక్షల పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా డిజిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ హోంగార్డ్స్ డీజీపీ స్వాతి లక్రా చేతుల మీదుగా చెక్కును మృతుడి భార్య కొడిగంటి స్వాతికి అందజేశారు.
ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీసు శాఖ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి సకాలంలో ఆర్థిక సాయం అందించిన యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ ప్రతినిధులు, హోంగార్డ్ రీజియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, ఏవో సాయి కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.