హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు గాంధీ భవన్. బీజేపీ కార్యాలయం శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరిట ఉన్నది.. సీపీఐ మగ్ధూం భవన్ పేరు పెట్టుకోగా.. సీపీఎం వాళ్లు మాకినేని బసవపున్నయ్య భవన్ అని పిలుచుకున్నారు. టీడీపీ ఆఫీసు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో నడుస్తున్నది. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఆఫీసు పేరు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ.. అక్కడ బీజేపీ కార్యాలయానికి కూడా పార్టీ పేరే పెట్టుకొన్నారు. సీపీఎం కార్యాలయానికి ఏకే గోపాలన్ భవన్గా, సీపీఐ కార్యాలయానికి అజయ్ పేరును పెట్టుకొన్నారు. ఇవన్నీ దేశంలోని వివిధ పార్టీలు తమ కార్యాలయాలకు పెట్టుకొన్న పేర్లు.కానీ మన కేసీఆర్..!టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు పెడుతున్న పేరు తెలంగాణ భవన్.
ఉద్యమ ఆరంభంలో హైదరాబాద్లో కట్టుకొన్న భవనం తెలంగాణ భవన్. తరువాత ప్రతి జిల్లాలో కడుతున్న భవనం తెలంగాణ భవనమే. ఇప్పుడు ఢిల్లీలో కడుతున్న భవనం పేరూ తెలంగాణ భవనమే. మిగిలిన పార్టీలకు కేసీఆర్కు వ్యత్యాసం గమనించారా? కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ గానీ తెలంగాణతో ఎంత మమేకమైనదో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. కేసీఆర్ అణువణువునా తెలంగాణ ఉంటే.. తెలంగాణ అణువణువునా కేసీఆర్ ఉన్నారు. అదొక విడదీయలేని బంధం. పరస్పరం మమేకమైన దేహాత్మల సంబంధం.
దేశరాజధానిలో తెలంగాణ భవన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. సమస్త మంత్రివర్గం, పార్టీ కార్యవర్గం, ప్రజాప్రతినిధులు, నాయకుల సాక్షిగా దేశరాజధానిలో మన ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి భూమిపూజ జరుగనున్నది.
అది కేవలం సిమెంట్ ఇటుకలతో కడుతున్న కాంక్రీటు కట్టడం కాదు. అది మన ఉద్యమాల ఇటుక రాళ్లను పేర్చి.. మన ఆకాంక్షల నీళ్లుపోసి .. మన ఆశలనే భవిష్యత్తును సిమెంటుగా చేసి నిర్మిస్తున్న భవనం.
అది కాంక్రీటు కట్టడం కాదు. అది తెలంగాణ జవం జీవం నిండి వెలిసే సజీవ నిర్మాణం.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పీవీ నరసింహారావు కేంద్రమంత్రిగా ఉన్నప్పటి సంగతి. తమిళనాడులోని ఒక సాధారణ కుటుంబీకుడికి బ్యాంకులో ఉద్యోగంకోసం ఢిల్లీలో ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఢిల్లీ వెళితే ఎక్కడుండాలనేది సమస్య. ఒక ప్రయత్నం చేసి చూద్దామని కేంద్ర మంత్రి పీవీకి తన పరిస్థితి తెలియజేస్తూ ఒక ఉత్తరం ముక్క రాసిండు. ఆశ్చర్యకరంగా పీవీ నుంచి బదులు వచ్చింది. ఈ ఉద్యోగార్థికి పీవీ తన ఇంటిలో రాత్రి బస ఏర్పాటు చేయడమే కాదు, మరుసటి రోజు ఆయనకు ఫలహారం, భోజనం ఏర్పాట్లుచేసి ఇంటర్వ్యూ అయిన తర్వాత రైలు టికెట్ బుక్ చేయడానికి తోడ్పాటునందించి రైల్వేస్టేషన్లో స్వయంగా తీసుకెళ్లి దిగబెట్టారు. ఈ విషయం పీవీ చెప్పుకోలేదు. తానెవరో తెలువకున్నా పీవీ చేసిన సహాయం గురించి అతడు ఒక ఆంగ్ల పత్రికలో రాస్తే ప్రపంచానికి తెలిసింది. ఈ ఉదంతం వల్ల ఒక రాష్ర్టానికి చెందిన వ్యక్తికి ఢిల్లీ వెళ్ళే అవసరం వస్తే ఎంత కష్టమో అర్థమవుతున్నది. తెలంగాణ బిడ్డలకు ఇటువంటి కష్టాలు రాకూడదంటే, ఢిల్లీలో మనకు ఒక అడ్డా ఉండాలి. దేనికైనా ఆశ్రయమిచ్చే భవనం మనకంటూ ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమూ ఇదే. ఈ లక్ష్యంతోనే ఢిల్లీలో గురువారం తెలంగాణ భవన్ నిర్మాణాన్ని తలపెట్టారు.
తమకంటూ రాష్ట్రం కావాలని తెలంగాణ బిడ్డడు ఢిల్లీలో బలిదానం చేసుకుంటే, కనీసం అతడి మృతదేహాన్ని కూడా ఏపీ భవన్లోకి రానీయలేదు. తెలంగాణ సమాజం ఇటువంటి గాయాలనెన్నింటినో పంటి బిగువున అనుభవించింది. కేసీఆర్ బాటలో నడిచి స్వరాష్ర్టాన్ని సాధించుకొన్నది. అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడిక ఇతర ప్రాంతాల్లో మన వసతులు నిర్మించుకోవడమూ అవసరమే. ఈ క్రమంలోనే కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టారు. ధనవంతులకు ఏ భవన్లూ అవసరం లేదు. ఫైవ్ స్టార్ హోటళ్ళుంటాయి. పరమాన్నాలుంటాయి. కానీ ఢిల్లీ వెళ్ళిన సబ్బండ వర్ణాల ప్రజల పరిస్థితి ఏమిటి? కేంద్ర సర్వీసుల పరీక్షకు వచ్చే పిల్లలుంటారు. ప్రేమయాత్రకు వెళ్ళే కొత్త దంపతులుంటారు. కడుపు నొచ్చినా కాలునొచ్చినా కనీసం మాట సహాయమైన దొరికితే బాగుండునని ఆవేదన పడుతుంటం. పిల్లలు విహార యాత్రకు పోతే, మన ఊరూ వాడాకాని చోట మన పిల్లలకు ఏమైనా ఇబ్బంది వస్తే చెప్పుకొనే దిక్కుండదు కదా అని ఇక్కడి తల్లిదండ్రులకు కలవరంగా ఉంటుంది. కాలం మారింది, ఒక్క చోటు ఉంటే పూట గడువదు. ఒక కుటుంబం, సమాజం అన్నాక ఎన్ని అవసరాలుండవు! ఇటువంటి పరిస్థితుల్లోనే తెలంగాణ సమాజానికి మేనమామ ఇంటికి పోయినంత స్వతంత్రంగా పోవడానికి వసతి ఉండాలి. ఢిల్లీలో తెలంగాణభవన్ ఏర్పాటు చేస్తున్నది అందుకే. ఢిల్లీలోనూ తెలంగాణ బిడ్డలున్నారు. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా ఒక్కచోట కలుసుకుందాం అనుకుంటారు. దసరా వస్తే పచ్చనాకు చేతిలో పెట్టుకొని పలుకరించుకుందాం అనుకుంటారు. అలైబలై అంటూ ఆనందంగా గడపాలనుకుంటారు. ట్యాంక్బండ్పై బతుకమ్మ ఆడే హక్కును కొట్లాడి తెచ్చుకున్న చరిత్ర మనది. ఢిల్లీలో మన ఆడబిడ్డలు ‘చిత్తూ చిత్తూల బొమ్మ, శివునీ ముద్దూల బొమ్మ’ అంటూ ఆడుకోవడానికి ఒక ప్రదేశం అవసరం కాదా! తెలంగాణ భవన్ అంటే ఒక సమావేశ మందిరం, ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక సౌహార్ద్ర నిలయం. నేడు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న భవనం తెలంగాణ సమాజ ఆత్మగౌరవ కేతనం. పల్లె నుంచి ఢిల్లీ వరకు అందరినీ అక్కున చేర్చుకునే, అండగా నిలిచే అమ్మ ఒడి! తెలంగాణ భవన్ అంటే మనందరి కోసం మనం కట్టుకుంటున్న సంఘీభావ సౌధం. తెలంగాణ వెలుపల రాజధానిలో మనకంటూ ఒక భవనం నిర్మించుకోవడం మన ఆత్మగౌరవాన్ని చాటుకోవడం. ఈ భవనానికి శంకు స్థాపన చేసే శుభదినం, మనందరికీ పర్వదినం.
అజరామరం మన చరిత్ర చాలా మంది చరిత్రను చదివి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. రెండో రకానికి చెందినవారే సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే తపనను రగిల్చి అలుపెరగని పోరాటం చేసిన నేత కేసీఆర్. హైదరాబాద్ హుస్సేన్సాగర్ ఒడ్డున జలదృశ్యంలో 20 ఏండ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న కేవలం వందమంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరి పోసుకున్నది మొదలు 14 ఏండ్లపాటు సాగిన పోరాటంలో సబ్బండ వర్ణాల భాగస్వామ్యంతో తెలంగాణ వచ్చింది. ‘కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ తేలిపోవాలని 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపడితే.. దిగొచ్చిన కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. కానీ.. ఆంధ్ర నేతల కుయుక్తులతో యూటర్న్ తీసుకోవడంతో రగిలిపోయిన తెలంగాణ త్యాగాల కొలిమిలా మారింది. చివరకు తెలంగాణ ఆవిర్భావం అనివార్యమైంది. 2014 జూన్ 2న మన ఆకాంక్షల ఫలం తెలంగాణ ఆవిర్భవించింది. ఇదంతా కేసీఆర్ నాయకత్వంలో.. టీఆర్ఎస్ వల్లనే సాధ్యపడింది. ఇవాళ టీఆర్ఎస్ మిగిలిన పార్టీలేవీ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది.
ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతున్నవేళ చరిత్రలో నూతన అధ్యాయం ఆవిష్కారమవుతున్నది. అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం గుండెచప్పుళ్లు ప్రతిధ్వనించిన హస్తినలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక ఎగురబోతున్నది. దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయపార్టీకి లేనివిధంగా టీఆర్ఎస్కు సొంత భవనం ఏర్పాటుకానున్నది. ఢిల్లీలోని వసంత్ విహార్లో 1,100 చదరపు మీటర్ల ప్రాంగణంలో నిర్మించనున్న తెలంగాణభవన్కు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. హస్తినలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఇంటి పండుగలా చేసుకొనేందుకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థి నాయకులు ఢిల్లీ బాటపట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కుటుంబసమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. వీరివెంట ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీ సంతోష్కుమార్ ఉన్నారు. సీఎం కేసీఆర్కు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బీబీ పాటిల్, బండా ప్రకాశ్, కేఆర్ సురేష్రెడ్డి, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకాంద, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి స్వాగతం పలికారు.
తెలంగాణభవన్ భూమి పూజ సందర్భంగా ఢిల్లీ పురవీధులన్నీ గులాబీయం అయ్యాయి. రాష్ట్రం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్రకార్యవర్గసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు విద్యార్థి నేతలు ఢిల్లీ చేరుకోవడంతో తెలంగాణభవన్ పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. ఢిల్లీకి చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులకు లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆతిథ్యం ఇచ్చారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యే అవకాశాలున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రధాని, హోంమంత్రికి నివేదించనున్నట్టు సమాచారం. విభజన చట్టంలో భాగంగా రాష్ర్టానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరనున్నట్టు తెలుస్తున్నది.
టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గురువారం నుంచి చేపట్టేందుకు పార్టీశ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ర్టవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండాను ఎగురవేయటంతో సంస్థాగత నిర్మాణం ప్రారంభం కానున్నది. ఈ నెల 20వ తేదీలోపు గ్రామ/వార్డు, మండల/పట్టణ కమిటీల ఎన్నికలు పూర్తిచేసుకొని, జిల్లా కమిటీల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.