అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దివ్యాంగులకు ఉపయోపడేలా నిపుణులు పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ (Jayeshranjan)అన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయ సాంకేతిక సమ్మిట్-2024 (Summit-2024) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దివ్యాంగుల అవసరాల కోసం ఏవిధంగా వినియోగించుకోవచ్చనే అంశంపై నిపుణులతతో సదస్సు నిర్వహించామని తెలిపారు.
బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొని దివ్యాంగులకు అవసరమైన అప్లికేషన్స్ రూపొందించడంపై చర్చించారన్నారు. సుమారు 1.3 బిలియన్ల దివ్యాంగుల కోసం అవసరమైన ఆవిష్కరణలను చేసేందుకు ఈ చర్చ దోహదం చేస్తుందన్నారు.
చర్చలో టీఎస్ఐసీ సీఐఓ శాంతా తౌటం, ఎల్వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్ పునరావాస కౌన్సెలర్ టి.వి.ఐశ్వర్య, అంధుల భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహేందర్ వైష్ణమ్, సీఎస్బీ ఐఎఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం.బాలలత తదితరులు పాల్గొన్నారు.