హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల హోర్డింగులు షాక్ ఇస్తున్నాయి. తమ రాష్ర్టాల్లో ఎక్కడైనా తెలంగాణ పథకాలు ఉన్నాయా! అని ఆలోచించుకొనేలా ఉన్నాయి. స్వాగతం చెప్పినట్టే కనిపిస్తున్న ఆ హోర్డింగులు నిజానికి వ్యంగ్యంగా, ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఎనిమిదేండ్లలో ఎలా పురోగమించిందో, వివిధ రంగాల్లో ఎలా దూసుకొని వెళ్తున్నదో.. ఇంగ్లిష్లో ఏర్పాటుచేసిన హోర్డింగులు వివరిస్తున్నాయి.
తెలంగాణ ప్రగతిపై బీజేపీ నాయకులకు అవగాహన కల్పించేలా ఉండటంతో.. వారి పరిస్థితి గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టు తయారైంది. హోర్డింగులను చూసి తెలంగాణ బీజేపీ పరువు గంగలో కలుస్తుందని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలేవీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ఇప్పుడీ హోర్డింగులు ప్రధాని మోదీ నేతృత్వంలోని నాయకత్వానికి టీఆర్ఎస్ షాక్ ఇచ్చినట్టే చెప్పాలి.
బీజేపీకి హోర్డింగుల వణుకు!
బీజేపీకి వణుకు మొదలైందా! అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ సాధించిన పురోగతిని వివరిస్తూ హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే.. వాటిని ఎకడికకడ చించివేయటమే దీనికి కారణంగా చెప్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేకే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ సర్కారు హోర్డింగులను చించివేసినట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హోర్డింగుల్లో, ఫ్లెక్సీల్లో ఎకడా ఎవరినీ విమర్శించినట్టు, వ్యంగ్యంగా వ్యాఖ్యలు లేవు. ఏ రాజకీయ పార్టీని తిట్టినట్టు కామెంట్లు లేవు. ఆ ఫ్లెక్సీల్లో అంతా తెలంగాణ సాధించిన విజయాల వివరాలే. అలాంటప్పుడు తెలంగాణ ప్రగతిని చూసి బీజేపీ ఎందుకు ఓర్వలేకపోతున్నది? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు జుమ్లాల(బూటకపు మాటలు)తో పని కానప్పుడు.. ఇలాంటి హమ్లా (విధ్వంసం)నే నమ్ముకుంటారని తేలిపోయిందని అంటున్నారు.
హోర్డింగుల్లోని అంశాలివే..