హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి బడ్జెట్లో కేంద్ర సర్కారు మరోసారి మొండిచెయ్యి చూపింది. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ పార్కులకు బడ్జెట్లో ఒక్క పైసా నిధులు ఇవ్వకపోవడం పరిశ్రమవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) కింద చేర్చింది.
ఈ రెండు కారిడార్ల పరిధిలోని హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్పీసీ), జహీరాబాద్లోని నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (ఎన్ఐఎంజెడ్)లలో మౌలిక సదుపాయాలకు రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఇందులో కనీసం 50 శాతం నిధులు బడ్జెట్లో కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, ఫార్మాసిటీ అభివృద్ధికి మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఇప్పటికే పలు దఫాలు కేంద్రానికి విజ్ఞప్తిచేసినా ఫలితం లేకుండా పోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ వద్ద 1300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనేకసార్లు కోరింది. ఇంత ప్రతిష్ఠాత్మక పార్కుపై కూడా కేంద్రం బడ్జెట్లో కనికరం చూపకపోవడం గమనార్హం. జహీరాబాద్ నిమ్జ్పైకూడా కేంద్రం చిన్నచూపు చూసింది. 2016 జనవరి 22న డీఐపీపీ తుది అనుమతులు మంజూరు కాగా, 12,635 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొదటిదశ ప్రాజెక్టులో భాగంగా అంతర్గత, బహిర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని తెలంగాణ సర్కారు కోరినా కేంద్రం స్పందించలేదు.