హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఇన్ఫ్లూయెంజాపై కొన్ని రోజులుగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న వేళ, ఆ వైరస్ పెద్ద ప్రమాదకరి కాదని ఐసీఎమ్మార్ వెల్లడించింది. కొవిడ్ తరహాలో ఇదేదో కొత్త వైరస్ అని పేర్కొన్నది. వాస్తవానికి ఈ వైరస్ కొత్తదేం కాదు.. మన దేశంలో దాదాపు 2002 సంవత్సరం నుంచి కాస్త ప్రభావం చూపుతున్నది. మొదట్లో ఈ వ్యాధి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపినా, ఆ తర్వాత సాధారణ జలుబుగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘హెచ్3ఎన్2’ కూడా ఇదే కోవకు చెందిందే. జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు, జ్వరం వంటి లక్షణాలే తప్ప ప్రాణాంతకంగా పరిణమించేలా ప్రభావం చూపడం లేదు. కొన్ని రోజులుగా ప్రపంచ దేశాల్లో లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా, ఒక్క మరణం కూడా నమోదు కాలేదని నిపుణులు చెప్తున్నారు. కొత్త వైరస్ లక్షణాలతో దవాఖానలకు వస్తున్న వారిలో సగటున 10-15 శాతం మంది మాత్రమే ఉన్నట్టు తేలింది. గర్భిణులు, ఐదేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్ల పైబడిన వృద్ధులకు ఈ వైరస్ కొంత ప్రభావం చూపే అవకాశాలున్నట్టు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరితో పాటు కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
హెచ్3ఎన్2 కేసులకు సంబంధించి గాంధీ మెడికల్ కళాశాలలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. కరోనా పరీక్షల తరహాలోనే ఈ పరీక్షలను కూడా చేస్తారని చెప్పారు. వీటికి ప్రత్యేకమైన కిట్స్ ఉంటాయని తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే ఫీవర్ హాస్పిటల్లో కూడా హెచ్3ఎన్2 నిర్ధారణ పరీక్షలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. హెచ్3ఎన్2తో పాటు అన్ని రకాల ఫ్లూలకు సంబంధించిన టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లూ-షాట్ టీకా తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్లూ నుంచి రక్షణ కల్పిస్తుంది.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇన్ఫ్లూయెంజా నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
హెచ్3ఎన్2 స్వైన్ఫ్లూ ఉప వేరియంట్. ఇది పాతవైరసే. ఈ ఫ్లూకు అవసరమైన పూర్తి చికిత్స మనదగ్గర అందుబాటులో ఉంది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదు. సొంత వైద్యం పనికిరాదు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానను ఆశ్రయించడం మంచిది.
– డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్
హెచ్3ఎన్2 ప్రమాదకారి కాక పోయినా గతంలో కంటే కొంత హాస్పిటల్ అడ్మిషన్స్ పె రుగుతున్నట్టు ఐసీఎమ్మార్ వెల్లడించింది. మరికొంత కాలం కరోనా నియమాలు పాటిస్తే ఈ ఫ్లూను కూడా జయించిన వారమవుతాం. దీనికి యాంటి వైరల్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ కిరణ్ మాడాల, నిజామాబాద్