హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల మధ్య అంతర్గత పోరు ముదురుతున్నది. సర్వీస్ నిబంధనల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెస్సీ విద్యార్హతతో శాస్త్రవేత్తలుగా ఉద్యోగంలో చేరిన తమపై నిబంధనలకు విరుద్ధంగా ఇంజినీరింగ్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని గుర్రుగా ఉన్నారు. పీసీబీలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు జూనియర్ స్థాయిలో నియామకం కావాల్సి ఉండగా.. ఇంజినీరింగ్ విభాగంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ క్యాడర్లో నియామకాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో సీనియారిటీ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు ముందంజలో ఉండి శాస్త్రవేత్తలపై లేని అధికారాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జూనియర్ సైంటిస్ట్లుగా చేరిన తమకు కాలుష్యం, పరిశ్రమల్లో వినియోగించే రసాయనాలపై అవగాహన ఉంటుందని, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సైంటిస్ట్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా కాలుష్య నియంత్రణకు సాంకేతిక తోడ్పాటును అందించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు అందుకు విరుద్ధంగా పరిశ్రమలను తనిఖీ చేస్తున్నారని శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమలపై చర్యలు చేపట్టేందుకు తాము చేసే సిఫారసులను ఇంజినీరింగ్ అకారులు అడ్డుకుంటున్నారని, దీంతో 15 ఏండ్ల నుంచి తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారుల విద్యార్హతలతోపాటు వారి నియామకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు. దీనిపై ఆరేండ్ల నుంచి పీసీబీ స్పందించకపోవడంతో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని ఆశ్రయించినట్టు సమాచారం.
పరిశ్రమల్లో సివిల్ ఇంజినీర్ల తనిఖీలు సమంజసమా?
ప్రస్తుతం పీసీబీ ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 70 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 15 మంది మాత్రమే కెమికల్ ఇంజినీర్లు, అధిక సంఖ్యలో సివిల్, మెకానికల్ ఇంజినీర్లు ఉన్నారు. వీరిలో కెమికల్ ఇంజినీర్లకు మాత్రమే రసాయన పరిశ్రమల్లో తనిఖీలు జరిపే నైపుణ్యం ఉంటుందని.. కానీ, సివిల్ ఇంజినీర్లు సైతం ఔషధ పరిశ్రమల్లో తనిఖీలు జరపడం ఎంత వరకు సమంజసమని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు పీసీబీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్ అధికారులే ఉండటంతో వారే ఆధిపత్యం చెలాయించారని, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే పీసీబీ ఉద్యోగుల సర్వీసు రూల్స్ను చక్కదిద్దాదలని, చట్టప్రకారం పని విభజన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.