Rangareddy District | రంగారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో వెనుకబడింది. పాలకుల పట్టింపులేమితో అన్ని రంగాల్లోనూ చతికిలపడింది. కానీ, స్వరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతున్నది. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నది. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత చేపట్టిన సంసరణలతో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది.
పరిశ్రమల నిర్వహణకు జిల్లా అనుకూలంగా ఉండడంతో కార్పొరేట్ కంపెనీలు తమ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకూ వేల కంపెనీలు కొలువుదీరగా, లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయి. మిషన్ భగీరథ పథకం జిల్లా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగా, మిషన్ కాకతీయ సరిపడా సాగునీరు అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో రంగారెడ్డి జిల్లా విద్య, వైద్యం, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్నది.
జిల్లాకు జలకళ..
తాగు, సాగునీటి రంగంలో తెలంగాణ సర్కారు తెచ్చిన విప్లవాత్మక మార్పుతో జిల్లాకు జలకళ వచ్చింది. మిషన్ కాకతీయతో జలవనరులు నిండుకుండలను తలపిస్తుండగా, మిషన భగీరథతో నల్లాల ద్వారా స్వచ్ఛజలం నట్టింటికి నడిచివస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయి. జిల్లాలోని 956 చెరువులను రూ.132.95కోట్లు వెచ్చించి మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పునరుద్ధరించారు. ప్రతి ఆయకట్టకు నీరందుతుండడంతో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ.476 కోట్ల వ్యయంతో 1,072 ఆవాసాల్లోని 2,94,705 ఇండ్లకు గడపగడపకూ తాగు నీటిని అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తుతో జిల్లాలో 1,20,713 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. జిల్లా ఏర్పడే నాటికి జిల్లాలో 33/11కేవీ సబ్స్టేషన్లు 181 ఉండగా.. స్వరాష్ట్రంలో కొత్తగా 276 సబ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చి కరెంట్ బాధలను తీర్చాయి. అన్ని క్యాటగిరీలకు కలిపి జిల్లాలో 21,31.319 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
ఇంటింటా సంక్షేమం
మహేశ్వరం అభివృద్ధికి రూ.1300 కోట్లు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మహేశ్వరం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఈ నియోజక వర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం రూ.1300 కోట్లతో చేపట్టిన పనులు చక చకా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం రూ.80 కోట్లతో పనులు చేపట్టారు. మీర్పేట, బడంగ్పేట కార్పొరేషన్లు, తుకుగూడ, జల్పల్లి మున్సిపాలిటీల్లో రూ.184 కోట్లతో, హెచ్ఎండీఏ నిధులతో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఆర్అండ్బీ నిధుల నుంచి రూ.432 కోట్ల నిధులతో రోడ్లను అభివృద్ధి చేశారు. టీఎస్ఐఐసీ ద్వారా రూ.14.66 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ నిధుల నుంచి రూ.331 కోట్లతో తాగు నీరందించే కార్యక్రమం చేపట్టారు. టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.13.86 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మహేశ్వరంలో దవాఖాన అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.165 కోట్లు విడుదల చేశారు. ఎస్ఎన్డీపీ నిధుల నుంచి రూ.92 కోట్ల నిధులతో నాలాలు, ట్రంక్లైన్ పనులు పూర్తి చేశారు. దీంతో మహేశ్వరం ఐటీ, విద్యా హబ్గా మారబోతున్నది.
‘పవర్’ఫుల్గా పారిశ్రామికం
రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల జాతర కొనసాగతున్నది. త్వరితగతిన అనుమతులు ఇవ్వడం, 24 గంటల నాణ్యమైన విద్యుత్తుతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో ఫాక్స్కాన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో 1,252 యూనిట్లను రూ.47,062 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించి.. మొత్తం 5,15,851 మందికి ఉపాధి కల్పించారు. అలాగే, జిల్లాకు పలు పారిశ్రామిక పారులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. మంఖాల్లో 179.13 ఎకరాల్లో ప్లాస్టిక్ పారు, చందనవెల్లిలో 1,454.03 ఎకరాల్లో పారిశ్రామిక పారు, 240 ఎకరాల్లో ఇబ్రహీంపట్నంలో పారిశ్రామిక పారు, ఇబ్రహీంపట్నంలో ఎంఎస్ఎంఈ పారు, 1,140 ఎకరాల్లో సీతారాంపూర్ పారిశ్రామిక పారు ఏర్పాటయ్యాయి. 195 ఎకరాల్లో నాగిరెడ్డిపల్లిలో పారిశ్రామిక పారు, 19,046.25 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కానున్నాయి. ఎలిమినేడులో 600 ఎకరాల్లో పారిశ్రామిక పారు, సిద్ధాపూర్లో 314 ఎకరాల్లో పారిశ్రామిక పారులు జిల్లాకు వచ్చాయి.