హైదరాబాద్ : భారత్, ఇండోనేషియా మధ్య వాణిజ్య సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయని భారత్లో ఇండోనేషియా కాన్సులేట్ జనరల్ అగస్ పీ సప్తనో పేర్కొన్నారు. తెలంగాణలో ఐటీ, ఔషధాలు, జీవశాస్త్రాలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆహార శుద్ధి, ఫర్నీచర్, విద్య, వైద్య పర్యాటకం తదితర రంగాల్లో వాణిజ్యానికి పుష్కలంగా అవకాశాలున్నాయని తెలిపారు. ఆయా రంగాల్లో తెలంగాణతో కలిసి ముందుకు సాగేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు.
భారత్లో అగస్ సప్తనో పదవీకాలం ఈ నెల 31తో పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య(ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని ఎఫ్టీసీసీఐలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2018లో భారత్ – ఇండోనేషియా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభం కాగా, గడచిన ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య 32బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని, 2025నాటికి ఇది 50బిలియన్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని వాణిజ్య మండలి ఇండోనేషియాతో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రపంచ ఆర్థిక మందగమనంలో సైతం భారత్, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయని గుర్తుచేస్తూ, భారత్ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నదని కొనియాడారు. ముఖ్యంగా ఐటీ, ఆరోగ్యం, ఔషధాలు, మెషినరీ, ఆటోమోటివ్ రంగాల్లో భారత్లో అపార అవకాశాలున్నాయని, ఈ రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర ప్రయోజనాలు కలిగిఉన్నాయన్నారు.
తెలంగాణలో మయోరా ఇండోనేషియా కంపెనీ ఆహార ఉత్పత్తులు, మిఠాయిలు, అలాగే వాక్సిందో కంపెనీ నాన్-హ్యూమన్ వ్యాక్సిన్ల రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇండోనేషియా నుంచి భారత్ పామాయిల్ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నట్లు, అంతేకాకుండా బొగ్గు, ఖనిజాలు, రబ్బర్, పల్స్, హైడ్రోకార్బన్లను కూడా గణనీయ పరిమాణంలో దిగుమతి అవుతున్నట్లు చెప్పారు. అలాగే, భారత్ నుంచి శుద్ధిచేసిన పెట్రోలియం ఉత్పత్తులు, మొక్కజొన్న, వాణిజ్య వాహనాలు, టెలీకమ్యునికేషన్ పరికరాలు, చమురు విత్తనాలను ఇండోనేషియా దిగుమతి చేసుకుంటున్నదన్నారు.
ఆటోమోటివ్ కాంపోనెంట్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, బయో-టెక్నాలజీ, హెల్త్కేర్ రంగాల్లో వాణిజ్యాన్ని విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రైవేటు రంగాలను ప్రోత్సహించేందుకు ఇరు దేశాలు తగిన విధానాలను రూపొందించాల్సివన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఇండోనేషియాలో నిర్వహించనున్న ట్రేడ్ ఎక్స్పోలో భాగస్వాములు కావాలని తెలంగాణ పారిశ్రామికవేత్తలను అగస్ సప్తనో ఆహ్వానించారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షలు అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.