Telangana | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐటీ, ఔషధాలు, జీవశాస్ర్తాలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆహార శుద్ధి, ఫర్నిచర్, విద్య, వైద్య, పర్యాటకం తదితర రంగాల్లో వాణిజ్యానికి పుష్కలంగా అవకాశాలున్నాయని భారత్లో ఇండోనేషియా కాన్సులేట్ జనరల్ అగస్ పీ సప్తనో తెలిపారు. ఈ రంగాల్లో రాష్ట్రంతో కలిసి ముందుకు సాగేందుకు చర్యలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు. భారత్లో సప్తనో పదవీకాలం ఈ నెల 31తో పూర్తి కానున్న సందర్భంగా తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని ఎఫ్టీసీసీఐలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018లో భారత్-ఇండోనేషియా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభం కాగా, గత ఐదేండ్లలో రెండు దేశాల మధ్య 32 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని, 2025 నాటికి ఇది 50 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని వాణిజ్య మండలి ఇండోనేషియాతో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ భారత్, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయని గుర్తుచేశారు. ఐటీ, ఆరోగ్యం, ఔషధాలు, మెషినరీ, ఆటోమోటివ్ రంగాల్లో భారత్లో అపార అవకాశాలున్నాయని, ఈ రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర ప్రయోజనాలు కలిగి ఉన్నాయని వివరించారు. ఇండోనేషియాకు చెందిన జాప్ఫా కాంఫీడ్, గోజెక్ ఇండోనేషియా, గరుడ ఫుడ్స్, నబాతి ఇండోనేషియా తదితర కంపెనీలు ఇప్పటికే పుణె, బెంగళూరు, చెన్నైలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, తెలంగాణలో మయోరా ఇండోనేషియా కంపెనీ ఆహార ఉత్పత్తులు, మిఠాయిలు, వాక్సిందో కంపెనీ నాన్-హ్యూమన్ వ్యాక్సిన్ల రంగంలో పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. ఇవేకాక, ఆటోమోటివ్ కాంపొనెంట్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, హెల్త్కేర్ రంగాల్లో వాణిజ్యాన్ని విస్తరించడానికి చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్లో ఇండోనేషియాలో నిర్వహించనున్న ట్రేడ్ ఎక్స్పోలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పారిశ్రామికవేత్తలను సప్తనో ఆహ్వానించారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.