హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : కొవాగ్జిన్ బూస్టర్ డోస్తో మంచి ఫలితాలు వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. బూస్టర్ డోస్పై నిర్వహించిన ఫేజ్-2 ఫలితాలను శనివారం వెల్లడించింది. మూడో డోస్ తీసుకున్న వారిలో దాదాపు 90 శాతం మందిలో ప్రతిరక్షకాలు పెరిగాయని, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపింది. ఈ ప్రతిరక్షకాలతో దీర్ఘకాల రక్షణ లభిస్తుందని పేర్కొన్నది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఐదు రెట్లు పెరిగినట్టు ప్రకటించింది. రెండో డోస్ వేయించుకున్న ఆర్నెల్ల తర్వాత బూస్టర్ తీసుకోవాలని సూచించింది. డాక్టర్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ పిల్లలకు, పెద్దలకు కొవాగ్జిన్ బూస్టర్ ఇచ్చేందుకు తాజా ఫలితాలతో మార్గం సుగమం అయ్యిందన్నారు. బూస్టర్తో రక్తంలో బీ, టీ సెల్స్ పెరుగుదల గుర్తించామన్నారు.