మనకు అన్ని వనరులు ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏవీ రావు. వీ ఆర్ జాక్ ఆఫ్ ఆల్. మాస్టర్ ఆఫ్ నన్. బకెట్ నీళ్ల కోసం చెన్నై తండ్లాడాలా? తన్నీర్ తన్నీర్ అనే సినిమా రావాల్నా? దాని చూసి పండ్లు ఇకిలించడం తప్ప పరిష్కారాన్ని ఇప్పటికీ ఆలోచించని దుస్థితి. – సీఎం కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): భారత ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు సిద్ధించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అపార భౌగోళిక, వాతావరణ, మానవ వనరులున్న దేశం చేరుకోవాల్సిన స్థాయిని అందుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 41 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నా ఇప్పటికీ పామాయిల్, కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ దుస్థితి ఇంకా కొనసాగాలో, నివారించాలో దేశ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి తదితరులు సోమవారం తెలం గాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ శాఖను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
బీఆర్ఎస్లో చేరి, పార్టీ ఎజెండాను యావత్ భారత దేశంలో వ్యాపింపజేయాలనే సదుద్దేశంతో మాజీ ఐఏఎస్ అధికారి, ఇటీవలి కాలంలో ప్రజా జీవితంలో చురుగ్గా పనిచేస్తున్న తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి, బహుజన సిద్ధాంతంతో కాన్షీరాం, బాలయోగి వంటి మహానాయకులతో కలిసి పనిచేసిన నాయకుడు, నిమ్నవర్గాల గురించి అనుక్షణం తపించే నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి, అనంతపురం నుంచి వచ్చిన కాపునాడు నాయకులు జేజే ప్రకాశ్, రమేశ్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావుకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
ప్రజల కోరిక నెరవేరలేదు..
స్వాతంత్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం. రాజకీయాలంటే జీవితాలను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసిన ఘటనలు మన భారత సమాజంలో జరుగుతుండేవి. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గనిర్దేశనంలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు మొదలు పెట్టుకున్నం. ఒక చక్కటి ప్రయాణం మొదలైంది. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఒక విజన్, ఒక డైరెక్షన్, ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు వెళ్లాలో మార్గం వేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని బాటలు పడ్డాయి. ఆ బాటల్లో కొనసాగుతూ వచ్చాం. తదనంతర కాలంలో రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అనేక మార్పులు వచ్చి నేడు మన కండ్ల ముందున్న సమాజం ఆవిష్కృతమైంది. 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను చూసిన, ప్రత్యక్ష అనుభవం కలిగిన, చదువుకున్న, నేర్చుకున్న, నాకు అవగాహన కలిగిన భారతదేశం ఏ దశకు చేరుకోవాలో ఆ దశకు చేరుకోలేకపోయింది. స్వాతంత్య్ర ఫలం, ప్రజల కోరిక నెరవేరలేదు.
స్వాతంత్య్ర ఫలాలు అందలేదని చెప్పడం చాలా బరువైన మాట. ఆ మాట ఎందుకు అంటున్నానో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
1) వ్యవసాయ అనుకూల భూమి: విస్తీర్ణంలో అమెరికా మన దేశంకన్నా రెండు రెట్లు పెద్దది. చైనా ఒకటిన్నర రెట్లు పెద్దది. కానీ అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయానికి అనుకూలం. చైనా మనకన్నా పెద్దగా ఉన్నా అక్కడ కేవలం 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి ఉంది. అదే మనదేశంలో 50 శాతం భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. మన దేశ భూభాగం 83 కోట్ల ఎకరాలు కాగా, ఇందులో సుమారు 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. సాగు బాగా జరగాలంటే దానికి ఇంకొన్ని అనుకూలతలు కావాలి.
2) సూర్యకాంతి:
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా సూర్యకాంతి మనదేశంపై విస్తారంగా, అపారంగా పడుతున్నది. సూర్యకాంతితోనే కిరణజన్య సంయోగ క్రియ జరిగి మంచి పంటలు వస్తాయి. ఆ శక్తి మన దగ్గర విస్తారంగా ఉన్నది.
3) వాతావరణ మండలాలు: దేశంలో మూడు రకాల వాతావరణ, పర్యావరణ మండలాలు ఉన్నాయి. ఆగ్రో ైక్లెమెటిక్ జోన్స్ ఉన్నాయి. సముద్ర తీరాన ఉండే తేమ ప్రాంతాలు గానీ.. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ తెలంగాణ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటివిగానీ.. అతి శీతలంగా ఉండే హిమాచల్, పంజాబ్, కశ్మీర్ హిమాలయ సానువుల ప్రాంతాలుగానీ ఉన్నాయి. దేశంలో ఆపిల్స్ మొదలు మామిడి కాయల వరకు అన్నీ పండుతాయి.
4) నీళ్లు: దేశంలో కురిసే వర్షపాతం 4వేల బిలియన్ క్యూబిక్ మీటర్లు. అంటే 1.40 లక్షల టీఎంసీల వర్షం కురుస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్ర ల్ వాటర్ కమిషన్ ఇచ్చిన లెక్క. 70 వేల టీఎంసీల నీళ్లు ఆవిరిగా మారిపోతున్నది. భూగర్భంలో కావొ చ్చు, నదీజలాల్లో ఉండేవి కావొచ్చు శుద్ధమైన నీరు 70వేల టీఎంసీలు దేశానికి అందుబాటులో ఉన్నాయి. అతివృష్టి పడితే అంతకుమించి నీటి సౌలత్ ఉన్నది.
5) మానవ వనరులు: భూమి ఉంది. సూర్యకాంతి ఉంది, పంటలు పండే పర్యావరణ మండలాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, వాటికి తోడుగా పనిచేసే మానవసంపద.. 139 కోట్లమంది ప్రజలు ఉన్నారు. వ్యవసాయం చేయడానికి నైపుణ్యాభివృద్ధి వంటి గొప్ప గొప్ప పదాలు అవసరం లేదు. తగిన పద్ధతిలో ప్రోత్సహిస్తే దేశం ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ చైన్ కలిగిన దేశంగా ఉండాలి. కానీ రైతులు 13 నెలలపాటు దేశ రాజధాని సరిహద్దుల్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితిని మనం కళ్లారా చూస్తున్నం. మన పిల్లలు మెక్డొనాల్డ్ బర్గర్లు, పిజ్జాలు తినడం చూస్తున్నాం. వాస్తవానికి మనకున్న కండిషన్లకు, పరిస్థితికి, మనుషులకు, వాతావరణానికి, సహజ వనరులకు ప్రపంచవ్యాప్తంగా మాకు ఇండియన్ ఫుడ్ కావాలనే డిమాండ్ రావాలి. బెస్ట్ ఫుడ్చైన్, ఫ్రెష్ ఫుడ్చైన్ ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఉన్నదా? మన దగ్గర వ్యవసాయాన్ని, దాని అనుబంధ పరిశ్రమలైన ఫుడ్ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేస్తే రైతాంగం, ఆ ఆహారపరిశ్రమల్లోని ఉద్యోగులతో దేశంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉండేది. కానీ, దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్ను దేశం దిగుమతి చేసుకుంటున్నది. కందిపప్పు లాంటి పప్పులనూ దిగుమతి చేసుకుంటున్నది. దేశం ఎందుకు ఇలా వంచించబడుతున్నది. ఈ దుస్థితి ఇలాగే ఉండాలా? ఇలాగే కొనసాగాలా? లేదా ఇది నివారించబడాలా? ఈ దేశంలోని యువత, ప్రజాజీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనిపై ఆలోచించాలని కోరుతున్నా.’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.