హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ఆధునిక టెక్నాలజీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఉన్న టెక్నాలజీకి ఆధునిక హంగులు జోడించి జీరో సెకండరీ వేస్టేజీ, నీటి వినియోగం లేకుండా బయో మీథేన్ ఉత్పత్తి అయ్యేలా ప్లాంట్ను డిజైన్ చేసింది. భారీ ఎత్తున ఉత్పత్తయ్యే ఆర్గానిక్ వేస్టేజీ ఉండే కూరగాయల మార్కెట్లలో వీటిని ఏర్పాటు చేయనుండగా, హైరేటెడ్ బయోగ్యాస్ను గృహావసరాలకు వాడుకునేలా దీన్ని రూపొందించారు.3 కిలోల తడిచెత్త నుంచి 300 గ్రాముల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని ఐఐసీటీ వర్గాలు చెబుతున్నాయి. నిత్యం 40 నుంచి 100 కిలోల వరకు బయోగ్యాస్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంట్లను ఆధునీకరించారు.
సులభంగా ఉత్పత్తి
పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో చెత్త నిర్వహణ సవాల్గా మారుతున్నది. ఈ క్రమంలో తడిచెత్త నుంచి ఎలాంటి అదనపు వేస్టేజీ లేకుండా హైరేటెడ్ బయో మీథేనేషన్ విధానంలో బయోగ్యాస్ ప్లాం ట్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రధానంగా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసి చెత్త నుంచి బయోగ్యాస్ను ఉత్పత్తి చేసేలా ఈ ప్లాంట్లను ఆధునీకరించారు. దీనికితోడు ఐఐసీటీ బయోగ్యాస్ ప్లాంట్ వల్ల చెత్త నిర్వహణ ఖర్చు చాలావరకు తగ్గుతుంది. ఏటా 18 నుంచి 20 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ ఆధునిక ప్లాంట్లకు ఉన్నది. 3 కిలోల చెత్త నుంచి నిత్యం ఒక్క క్యూబిక్ మీటర్ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఇది 300 గ్రాముల ఎల్పీ గ్యాస్తో సమానమని ఐఐసీటీ వర్గాలు పేర్కొన్నాయి.