Indian Bison | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన అతిథి ప్రత్యక్షమైంది. భారీ బరువు ఉన్న భారతీయ బైసన్ నల్లమల అడవుల్లో మొదటిసారిగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా జాతీయ రహదారిని దాటుతూ మొదటిసారి కనిపించిన ఈ బైసన్.. కర్ణాటకలోని అడవి మార్గం నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించిందని భావిస్తున్నట్టు అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజన్ అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు. బౌరాపూర్ చెంచు కుగ్రామం సమీపంలో బైసన్ మొదటిసారిగా కనిపించిందని, అంతకు ముందు నారాయణపేట రిజర్వ్ ఫారెస్ట్లోనూ దానిని గుర్తించినట్టు వివరించారు.
మైదాన ప్రాంత జంతువైన బైసన్ అమ్రాబాద్ అడవుల్లోకి రావడం సంతోషకరమని, కెమెరా ట్రాప్ ఇమేజీలతో దాని కదలికలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అది అచ్చంపేట పట్టణం నుంచి ఫారెస్ట్ కోర్ ఏరియాకు చేరుకున్నదని గుర్తించినట్టు అమ్రాబాద్ వైల్డ్ లైఫ్ బయో సైంటిస్ట్ మహేందర్రెడ్డి తెలిపారు. అంతకంటే ముందు డిండి రిజర్వాయర్ సమీపంలోని వ్యవసాయ భూములు, గ్రామాలను దాటినట్టు కనుగొన్నామని, ఆపై ఉత్తరం వైపునకు తిరుగుతూ ముందుగు సాగుతున్నట్టు గుర్తించగలిగామని మహేందర్రెడ్డి తెలిపారు. 300 నుంచి 400 కిలోల మధ్య బరువు ఉంటుందని తెలిపారు. బైసన్ ఇక్కడ స్థిరపడితే పులి మినహా ఇతర జంతువులతో ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొన్నారు.