హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): భారత్-అమెరికా మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయని హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. భారత్కు ప్రధాన రక్షణ పరికరాల సరఫరాదారుగా అమెరికా ఎదుగుతున్నదని, అతిపెద్ద సైనిక భాగస్వామిగా అవతరించిందని చెప్పారు. హైదరాబాద్, కోల్కతాలోని అమెరికా కాన్సులేట్లు, అమెరికా రక్షణ శాఖ, సీయూటీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ కలిసి శుక్రవారం హైదరాబాద్లో ‘డిఫెన్స్ న్యూస్ కాంక్లేవ్’ పేరుతో వర్క్షాప్ నిర్వహించాయి. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ.. గత 15 ఏండ్లలో అమెరికా-భారత్ మధ్య రక్షణ రంగ ద్వైపాక్షిక వాణిజ్యం 25 బిలియన్ డాలర్ల మేరకు పెరిగినట్టు తెలిపారు. రక్షణ రంగంతోపాటు పలు ఇతర రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయని, ముఖ్యంగా ఏరోస్పేస్ రంగంలో భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, సాంకేతికత బదిలీని సులభతరం చేయడం, స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడం లాంటి అంశాల్లో పురోగతి సాధించాయని చెప్పారు. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ లాంటి కంపెనీలు టాటా కంపెనీతో కలిసి హైదరాబాద్లో అద్భుతమైన ఏరోస్పేస్ పరిశ్రమలను స్థాపించాయని గుర్తుచేస్తూ.. రక్షణ రంగంలో భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచ శాంతిభద్రతలకు మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదల, ఇండో-పసిఫిక్లో వ్యూహాత్మక ప్రణాళికలపై ప్యానల్ చర్చలు నిర్వహించారు.