తెలుగు ఎన్నారైలకు కవిత అభినందన
ఆటా సభల్లో తెలంగాణ పెవిలియన్కు ప్రారంభోత్సవం
బతుకమ్మ ప్రత్యేక సంచిక ఆవిషరణ
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు ఎదిగారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. అనంతరం రచయిత్రి ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆవిషరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అమెరికాలో ఉన్న తెలుగువారికి తెలియజేసేందుకు తొలిసారిగా ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటుచేయడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ప్రతి మహాసభలోనూ తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటుచేయాలని ఆటా ప్రతినిధులను కోరారు. ఆటా అంటే ఆంధ్ర-తెలంగాణ అసోసియేషన్ అని అభివర్ణించారు. ఒకప్పుడు తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తీసుకొస్తే, ఇప్పుడు తెలంగాణ వారికి కేసీఆర్ గుర్తింపు తెచ్చారని చెప్పారు.
అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందని అన్నారు. మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేందుకు ఆటా ప్రతినిధులు చేస్తున్న కృషిని కొనియాడారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు తానా, ఆటాలు ఏదైనా నగరంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. మాల్దీవులు, మారిషస్లో ఉన్న తెలుగు వారంతా, తెలుగు భాష, సంస్కృతిని నిలబెట్టుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు ప్రజల భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఆటాకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
కేసీఆర్తో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం: మంత్రి ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా 17వ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. గత 15 ఏండ్లుగా తాను ఎమ్మెల్యేగా పాల్గొన్నానని, ఈ సారి మంత్రిగా వచ్చానని చెప్పారు. ఆటా మహాసభలు ఎంతో ప్రత్యేకమైనవని, మనం ఎకడ ఉన్నా, అంతా ఒకటే అని చాటుతున్నాయని పేర్కొన్నారు. కరోనా కష్టాలను అధిగమించి, ఈ పండుగను నిర్వహించుకోవడం సంతోషకరమని చెప్పారు. ఇలా అందరినీ కలవడం, ఒక కుటుంబం లాగా గడపడానికి మించిన ఆనందం బహుశా ఎకడా దొరకదని అన్నారు. అమెరికాలోని తెలుగువారు మన సంస్కృతి, భాష, యాస, దేశం, రాష్ట్రం, మన ఊరును గుర్తుకు చేసుకొంటూ, గుండెల్లో నిలుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మహాసభలో మంత్రులు నిరంజన్రెడ్డి, మల్లారెడ్డ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రవీంద్రకుమార్, చంటి క్రాంతికిరణ్, గాదరి కిశోర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, ఆటా వ్యవస్థాపక సభ్యుడు హన్మంతరెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.